సిరికొండ, మే 22 : కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేసే అసత్య ప్రచారాలను ఎండగట్టాలని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర, కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమాలతో ప్రజల్లోకి రావాలని చూస్తూ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మండలంలోని వివిధ శుభకార్యాల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో పేర్లు మార్చి మన పథకాలనే అమలుచేస్తున్నారని అన్నారు.
మిషన్ భగీరథ పథకాన్ని చూసి ప్రధానమంత్రి జల్ జీవన్ పేరిట అమలుచేశారని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా సీఎం కేసీఆర్ ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారని, ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రజలు నీటి కోసం రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వచ్చి అబద్ధ్దాలను ప్రచారం చేస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వొద్దని పిలుపునిచ్చారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేసినా.. సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తున్నారని అన్నారు. సమావేశంలో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీల శ్రీరాములు, జడ్పీటీసీ సభ్యుడు మలావత్ మాన్సింగ్, సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నారవోయిన శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల తిర్మల్, సర్పంచులు రాజారెడ్డి, రమేశ్, గంగదాస్, నర్సారెడ్డి, లక్ష్మీనర్సయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.