డిచ్పల్లి, మే 22 : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో 34 గ్రామాల ఉపాధి హామీ సామాజిక ప్రజావేదిక రెండో రోజైన ఆదివారం కొనసాగింది. డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద డీఆర్డీవో చందర్నాయక్ ఆధ్వర్యంలో ఆడిట్ నిర్వహించారు. శనివారం రాత్రి 9 గంటల వరకు కేవలం తొమ్మిది గ్రామాలకు సంబంధించిన రికార్డులను ఆడిట్ చేయడంతో మిగతా గ్రామాలకు సంబంధించిన ఆడిట్ను ఆదివారం నిర్వహించారు. నలుగురు సిబ్బంది రికార్డులు సమర్పించకుండా ఎంబీలు మాయం చేయడంపై ఏపీవోలు ఓంకార్, మంజుల, ఉపాధి హామీ టీఏలు సౌజన్య, సంపూర్ణకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు విజిలెన్స్ అధికారి నారాయణ, డీఆర్డీవో చందర్నాయక్ వెల్లడించారు.
ఉపాధిహామీ ఎంబీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. సర్పంచులు, కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది ఎదుటే పనుల్లో జరిగిన అక్రమాలను బహిర్గతం చేయడంతో పలువురు సర్పంచులు, ఉపాధి హామీ సిబ్బంది నీళ్లు నమిలారు. రూ.16 కోట్ల 43 లక్షల 52 వేల 954 విలువ చేసే పనులు చేపడితే రూ.3 కోట్ల 95 లక్షల 96 వేల 703 రూపాయలకు సంబంధించిన లెక్కలు లేవని అధికారులు స్పష్టంచేశారు. ఉపాధిహామీ పనుల్లో అక్రమాలు తేటతెల్లం కావడంతో పలు గ్రామ పంచాయతీలకు నిధుల రికవరీకి అధికారులు ఉత్వర్వులు ఇచ్చారు. కొరట్పల్లి తండాలో మూడు ఫాంపాండ్స్ చేపట్టినట్లు రికార్డుల్లో పొందుపర్చినా పనుల పురోగతి మాత్రం శూన్యమని, పనులు చేయకుండానే బిల్లులు మాయం చేశారని వెల్లడించారు. నర్సింగాపూర్ గ్రామంలో శ్మశానవాటికకు సంబంధించిన రూ. 57 వేల విలువ చేసే పనులు అసంపూర్తిగా మిగిల్చి నిధులను డ్రా చేశారని, పనులు పూర్తి చేసి నిధులను రికవరీ చేయాలని విజిలెన్స్ అధికారి నారాయణ ఎంపీడీవోను ఆదేశించారు. కొరట్పల్లి గ్రామంలో మొక్కలు నాటకుండానే బిల్లులు మాయం చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేంద్రప్ప, ఉపాధి హామీ సిబ్బంది, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.