కామారెడ్డి, మే 22: రైతు సంక్షేమంలో భాగంగా వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు, పెట్టుబడి సాయం అందించడంతోపాటు సాగునీటిని పుష్కలంగా అందుబాటులోకి తెచ్చింది. దీంతో పంటల సాగు విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో అన్నదాతకు పంట రుణాల (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) పరిమితిని పెంచుతూ బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోవ్యవసాయం కోసం కామారెడ్డి జిల్లాలో రూ.4,700 కోట్ల రుణాలను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో రైతులకు ఈసారి బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలు అందే ఆవకాశం ఏర్పడింది. ఆహార ధాన్యాలతోపాటు వాణిజ్య పంటలకూ రుణాలు తీసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ వ్యాప్తి కారణంగా రెండేండ్లపాటు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది రుణ పరిమితిని పెంచాలని తెలంగాణ రాష్ట్ర సహకార ఆపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి జిల్లాల పరిధిలోని లీడ్ బ్యాంక్ మేనేజర్లు, వివిధ శాఖల బ్యాంకు అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు అందాయి. ఇటీవల కామారెడ్డి జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో రుణాలపై చర్చించారు.
అన్ని రకాల పంటలకూ వర్తింపు..
కామారెడ్డి జిల్లాలో రైతులు పండిస్తున్న అన్ని రకాల పంటలకూ రుణాలు అందజేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో కొన్ని రకాల పంటలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనకడుగు వేసేవారు. కానీ టెస్కాబ్ నిర్ణయంతో ఆహార ధాన్యాలతోపాటు వాణిజ్యపంటలకూ రుణాలను వర్తింపజేయనున్నారు. వరి, పత్తి, చెరకు, పసుపు, ఆయిల్పామ్, మామిడి, సజ్జ తదితర పంటలకు రుణపరిమితిని పెంచారు. యాసంగి పంట కొనుగోళ్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో వానకాలం సీజన్ పనులు ప్రారంభించేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునేందుకు అన్నదాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందుగా వేసవి దుక్కులను మొదలుపెట్టడంతో ట్రాక్టర్లకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కామారెడ్డి జిల్లా పరిధిలో బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల్లో ఇప్పటికే వానకాలం సీజన్ పనులను ప్రారంభించడంతో రైతులు రుణాలకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పంట రుణాల పరిమితిని పెంచడంతో అన్నదాతల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.