వేల్పూర్, మే 22: ప్రభుత్వ ఉద్యోగాల పోటీపరీక్షలకు సన్నద్దమయ్యే బాల్కొండ నియోజకవర్గ యువతీ యువకుల కోసం రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సొంత ఖర్చుతో వేల్పూర్ మండలం హనుమాన్ నగర్(వడ్డెర కాలనీ)లో ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. శిక్షణ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సుమారు 500 మంది యువతీ యువకుల కోసం పూర్తిశిక్షణ కాలం పాటు మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేయించారు. కోచింగ్ సెంటర్ వద్దనే ప్రత్యేకంగా వంటకాలు చేయిస్తున్నారు. ఉద్యోగార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్న మంత్రి సూచన మేరకు మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కేంద్రం వద్ద ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.