ఎల్లారెడ్డి, జనవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం, మౌలిక సదుపాయాలు కల్పించడాన్ని ఉపాధ్యా య సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్న పాఠశాలలు ఇప్పుడు కార్పొరేట్ స్థాయికి ఎదుగుతాయని వారు పేర్కొంటున్నారు. ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమం బోధనతో మరింత చురుకుగా పని చేస్తారని, విద్యార్థుల సంఖ్య రెండింతలు పెరిగే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే ఇలా…
నమస్తే : ప్రభుత్వం చేపట్టనున్న మన ఊరు-మన బడి కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏమిటి ?
దామోదర్ రెడ్డి : ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని పీఆర్టీయూ పక్షాన స్వాగతిస్తున్నాం. మా సంఘం తరఫున పూర్తిగా సహకరి స్తాం. ఈ కార్యక్రమం ప్రారంభించడం వజ్రం బంగారంతో పొదిగినట్టుగా ఉంటుంది. వజ్రాల్లాంటి ఉపాధ్యాయులకు బంగారం లాంటి మౌలిక సదుపాయలు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య విద్యార్థులకు లభిస్తుంది.
వజ్రాల్లాంటి ఉపాధ్యాయులు అంటే ఏమిటి?
అనేక రకమైన రసాయనిక, భౌతిక పరీక్షలను ఎదుర్కొనే సత్తా ఉంటుంది వజ్రానికి. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులకు డిగ్రీలు, మాస్టర్ డిగ్రీల విషయ పరిజ్ఞానంతో, బోధనా విధానాలు తెలిసి ఉన్నందున వారు వజ్రంలాంటి వారు. వేలాది మందితో పోటీ పడి ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైన వారు ఆంగ్ల మాధ్యమంలోనూ బోధించడానికి సిద్ధంగా ఉన్నారు.
మౌలిక వసతుల కల్పనతో చేకూరే ప్రయోజనాలు ఏమిటి ?
ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా 12 అంశాలతో మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నది. దీంతో మంచి అభ్యసనం విద్యార్థులకు సొంతం కానున్నది. దీనికి తోడుగా గ్రామాల సహకారం తీసుకుంటుంది. మౌలిక సదుపాయాల్లో కొన్ని ఇలా ఉన్నాయి. ప్రతి తరగతికి ఒక గది, ప్రతి గదిలో డిజిటల్ స్క్రీన్, ప్రతి తరగతి గదిలో గ్రీన్ బోర్డులు, పిల్లలకు వేర్వేరుగా మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం కల్పించడం పిల్లల మానసిక ఉల్లాసానికి దారి తీస్తుంది.
ఆంగ్ల మాధ్యమంపై మీ అభిప్రాయం ఏమిటి?
మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అంతర్జాతీయ వేదికలపై మన విద్యార్థులు శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాలంటే కచ్చితంగా ఆంగ్లమాధ్యమం అవసరం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన లేక పోవడం కారణంగానే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు మనుగడ సాగిస్తున్నాయి.
ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పటికే కరోనా కారణంగా ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు ఇక్కడే ఉంటారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య రెండింతలు పెరుగుతుంది.