వర్ని, మే 19: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతున్నదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని మోదీ సర్కారు సేకరించకపోయినప్పటికీ రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని పేర్కొన్నారు. యాసంగిలో పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకుంటున్నారని అన్నారు. వర్ని మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం జీలుగ విత్తనాల పంపిణీని ప్రారంభించారు. అనంతరం చందూర్ మండలానికి చెందిన లబ్ధిదారుడు ప్రవీణ్కు దళితబంధు పథకం కింద మంజూరైన పేయింట్స్ దుకాణాన్ని ప్రారంభించారు. వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. మండలంలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీడీవో కార్యాలయం వద్ద అందజేశారు.
ఈ సందర్భంగా భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేయడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని అన్నారు. అట్టడుగు వర్గాలవారు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించిన దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మండల కో-ఆప్షన్ సభ్యుడు కరీం, ఏంఎసీ చైర్మన్ కవితా అంబర్సింగ్, వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచులు రాజు, వెంకటేశ్వర్లు, నానిబాబు, కర్లం సాయారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గఫార్, జ్యోతి, తహసీల్దార్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.