నిజామాబాద్, మే 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఏటా హరితహారంలో నాటుతున్న మొక్కలు పెరిగి వృక్షాలుగా ఎదగడంతో పచ్చదనం కనువిందు చేస్తున్నది. పల్లెల్లో, రహదారుల వెంట నాటిన మొక్కలు నీడనిస్తున్నాయి. ఈ క్రమంలో ఎనిమిదో విడుత హరితహారానికి నిజామాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ప్రస్తుతం వానకాలంలో జిల్లాలో 45 లక్షలు మొక్కలను నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అటవీ విస్తీర్ణం 33శాతం పెంచాలని సర్కారు కృతనిశ్ఛయంతో ఉన్నది. సరిగ్గా ఎనిమిదేండ్ల క్రితం హరితహారం పథకానికి నాంది పలికింది. నాటి నుంచి విజయవంతంగా కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఒకప్పుడు కోట్లాది మొక్కలు పెంచడం ద్వారా ఆయా శాఖల్లో అధికారులు, సిబ్బంది మొక్కుబడిగా ముగించారు. దీంతో ఫలితం లేదని గ్రహించిన ఉన్నతాధికారులు కచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించి సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. 2015లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఏటా లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. రెండేండ్ల నుంచి లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నారు. ఎనిమిదో విడుత కింద నాటేందుకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
మొదట్లో హరితహారం ప్రారంభమైన సమయంలో మొక్కలు అందుబాటులో లేకపోయేవి. ప్రైవేటు నర్సరీల్లో కొనుగోలు చేసి నాటడం భారీ తంతుగా ఉండేది. దీంతో ఖర్చును నిలువరించేందుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వ ఖర్చుతోనే నర్సరీలను సర్కారు ఏర్పాటు చేసింది. ఇది వరకు కొన్ని చోట్ల మాత్రమే నర్సరీలు ఉండేవి. మూడేండ్ల నుంచి ప్రతి గ్రామానికి నర్సరీని ఏర్పాటు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వన నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలో 530గ్రామ పంచాయతీల్లో వాటిని ఏర్పాటు చేయగా, పురపాలికల్లో సైతం నర్సరీలను నిర్వహిస్తున్నారు. వీటిల్లో 2022 హరితహారం కోసం సుమారుగా కోటి మొక్కలను పెంచుతున్నారు. వానకాలం ప్రారంభ సమయానికి హరితహారం కార్యక్రమంలో వీటిని నాటేందుకు వినియోగించనున్నారు. నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడ మొక్కలు నాటాలనే అంశంపై పలు సూచనలు చేశారు. ఈసారి 45 లక్షల మొక్కలను నాటేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇందులో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖలకే కీలమైన బాధ్యతలున్నాయి.
అటవీ శాఖకు సవాల్..
నాటిన మొక్కలను బతికించుకునేందుకు ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించింది. వానలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో నాటిన మొక్కలకు జీవం పోసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా అంటే ఒకప్పుడు సువిశాల అటవీ ప్రాంతం.. ఇప్పుడు కాస్తా అడవి హరించుకుపోవడంతో వర్షాలు లేక ఏటా అక్కడక్కడ అల్ప వర్షాపాతం సైతం నమోదవుతున్నది. అటవీ సంపదను పునరుద్ధరించి ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పథకాన్ని అమలు చేస్తున్నది. జిల్లాలో హరితహారం పథకంలో భాగంగా ఇప్పటి వరకు కోట్లాది మొక్కలు నాటారు. ఈసారి వర్షాలు అంచనాలకు తగ్గట్లుగా కురిస్తే నాటిన మొక్కల్లో 70నుంచి 80శాతం బతికే వీలున్నది. హరితహారం కార్యక్రమం జిల్లా అటవీ శాఖ అధికారులకు సవాల్గా మారనున్నది. అనేక ఆరోపణలు మూటకట్టుకున్న ఇక్కడి సిబ్బంది గతేడాది నిర్వహించిన కార్యక్రమంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. జిల్లాస్థాయి అధికారి నుంచి కిందిస్థాయి వరకు బాధ్యతారాహిత్యానికి మొక్కల సర్వైవల్ రేటు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. వేసవికాలంలో అడవుల్లో నాటిన మొక్కలు సైతం సంరక్షించే వారు కరువవ్వడంతో తీవ్ర విమర్శలు వినిపించాయి.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత..
హరితహారం కార్యక్రమం చాలా గొప్ప ప్రయోజనాలతో కూడుకున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొక్కల పెంపకాన్ని చేపడుతున్నది. సోషల్ ఫారెస్ట్ను పెంచేందుకు చేస్తున్న కృషిలో అటవీ శాఖ సైతం భాగస్వామ్యమవుతున్నది. మొక్కలను సంరక్షించడం అన్నది కనీస బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రభుత్వ సూచనలు, సలహాలతో ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
– సునీల్ ఎస్ హీరమత్, నిజామాబాద్ జిల్లా అటవీ అధికారి
సంరక్షణ కీలకం..
వేసవికాలంలో ఎండలు ప్రతాపం చూపించాయి. ఉష్ణతాపాన్ని చవిచూసిన ప్రజలంతా వేడి నుంచి ఉపశమనాన్ని కోరుకున్నారు. ఎండాకాలం ఎలా గడుస్తుందో అంటూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే, ఎండాకాలం ముగుస్తుందని సంబురపడినా ఇప్పుడదీ తాత్కాలికమే. ఎందుకంటే భవిష్యత్తులోనూ అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం పడకుండా ఉండాలంటే మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలి. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో చాలా చోట్ల అడవి గొడ్డలి వేటుకు విలువైన వృక్ష జాతులు బలవుతున్నాయి. పచ్చదనం కాస్తా కనుమరుగై మైదానాలను తలపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ప్రకారం పచ్చదనం 33శాతానికి చేరాలంటే జిల్లాలో సగటున ప్రతి ఒక్కరూ 20మొక్కలు నాటాలి. వరుణుడు వర్షించే వేళ మొక్కలను నాటేందుకు సరైన సమయం. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో చైతన్యవంతులైన ప్రజలు మొక్కలు నాటే హరితయజ్ఞంలో భాగస్వాములైతే హరిత సంకల్పం నెరవేరినట్లేనని అధికారులు భావిస్తున్నారు. పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, జాతీయ రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్, మల్టీ లేయర్ కమ్యూనిటీ ప్లాంటేషన్ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నీటిపారుదల శాఖ పరిధిలోని చెక్డ్యాంలు, చెరువులు, కాలువలు, కుంటలు వద్ద మొక్కలు నాటేందుకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం సూచించింది.