నిజామాబాద్ క్రైం,మే 16 : వేసవి కాలంలో అడవు ల్లో కార్చిచ్చు కలవరపెడుతుంది. ప్రస్తుతం ఆకురాలే కాలం కావడంతో వివిధ కారణాలతో అడవులు అగ్నికి ఆహుతయ్యే సంఘటనలు చోటుచేసుకుంటాయి. గతంలో తమిళనాడులోని పశ్చిమ కనుమల అడవుల్లో చెలరేగిన కార్చిచ్చుకు పదిమంది బలయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీశాఖ మరింత అప్రమత్తమైంది. అడవులను దహించే కార్చిచ్చును ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకోసం అటవీశాఖకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది.
ప్రతి ఎండాకాలంలో ప్రమాదాలు ..
ప్రతి ఎండాకాలం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే మా సాల్లో అడవుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఈ ప్రమాదాల్లో కొన్ని సంఘటనలు చెట్ల కొమ్మలు రాపిడి జరగడంతో చోటు చేసుకుంటాయి. ఇవి కాకుండా ఎక్కువ శాతం అగ్నిప్రమాదాలు మాన వ తప్పిదాల కారణంగానే జరుగుతుంటాయి. వీటిలో అటవీ ప్రాంతం పక్కనే ఉన్న రోడ్లు, రహదారుల వెంట వెళ్లే జనం చెట్లకు నిప్పంటించడం ఒక కారణమయితే, తునికాకు సేకరించే కాంట్రాక్టర్లు అడవులకు నిప్పంటించిన సంఘటనలు సైతం ఉంటాయని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.అయితే ఈ ప్రమాదాలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఫారెస్టు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇందులో ప్రివెన్షన్, డిటెన్షన్, పోస్ట్ఫైర్ మేనేజ్మెంట్ విధానాలపై రాష్ట్ర అటవీశాఖ అధికారులు కిందిస్థాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జిల్లాలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో నిఘా..
జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలో 30 మంది స్ట్రయికింగ్ ఫోర్స్ను అందుబాటులో ఉంచారు. నిజామాబాద్ డివిజన్లో 1)నిజామాబాద్ నార్త్రేంజ్, 2)నిజామాబాద్ సౌత్రేంజ్, 3)ఇందల్వాయి, 4) వర్ని రేంజ్తో పాటు ఆర్మూర్ డివిజన్లోని 1)కమ్మర్పల్లి రేంజ్, 2)ఆర్మూర్, 3) సిరికొండ రేంజ్ పరిధిలో ప్రత్యేక ఫోర్స్ను అందుబాటులో ఉంచారు. అటవీ ప్రాంతంలో అగ్రి ప్రమాదాలు చోటు చేసుకుంటే మంటలు ఆర్పేందుకు ఈ ర్యాపిడ్యాక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ ఫోర్స్(రక్షణ సిబ్బంది)కి ఎస్సెమ్మెస్ అలర్ట్ వెళ్తుంది. దీని ద్వారా ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న సిబ్బంది జీపీఎస్ ద్వారా ఘటనా స్థలానికి చేరుకుంటారు. రిస్క్జోన్లలో ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అధికారు లు సూచిస్తున్నారు. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927, టీఎస్ ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం అగ్నిప్రమాదాలకు కారణమైన వారికి ఆరునెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రత్యేక ఫైర్ బ్లోవర్స్..
అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిన సమయం లో అది చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా సిబ్బందిని రంగంలోకి దించుతారు. మంటలను అదుపుచేసేందుకు అటవీ శాఖ వద్ద ఫైర్బ్లోవర్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఏడు రేంజ్లలో 10 బ్లోవర్స్ ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదం సంభవించిన ప్రదేశానికి సిబ్బంది చేరుకొని ఈ ఫైర్బ్లోవర్తో మంటలను అదుపులోకి తీసుకువస్తారు.
నిర్దేశిత ప్రదేశాల్లో ఫైర్లైన్స్ ఏర్పాటు..
తునికాకు సేకరించే కాంట్రాక్టర్ల కారణంగా కూడా అడవులు తగలబడుతున్నట్లు గుర్తించినట్లు జిల్లా అటవీ అధికారులు తెలుపుతున్నారు. తునికాకు పెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం డిపార్ట్మెంట్ సిబ్బంది ఫైర్లైన్స్ చేపడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఎండుటాకులు ఎక్కువగా రాలి ఉండడం వలన ఎక్కడైనా ఒకచోట నిప్పంటించిన్నట్లయితే అది చుట్టు పక్కల వ్యాపించి అటవీలో భారీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫారెస్టు సిబ్బంది ప్రతి ఏరియాలో సుమారు 5 మీటర్ల వ్యాసార్థంలో ఆకు, చెత్తను సమీకరించి దగ్గరుండి కాల్చివేయడం ద్వారా అటవీలో జరిగే నష్టాన్ని అదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది.