కామారెడ్డి రూరల్, మే 15 : తుక్కుగూడలో బీజేపీ నిర్వహించింది సంగ్రామ యాత్ర కాదని, అబద్ధాల యాత్ర అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. 70 ఏండ్లు దేశాన్ని రెండు పార్టీలు మాత్రమే శాసించాయన్నారు. ఈ 70 ఏండ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఏడేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తోందన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరా బాద్లో శనివారం నిర్వహించిన యాత్ర ప్రజా సం గ్రామ యాత్ర కాదని తెలంగాణ రాష్ట్రంపై పచ్చి అబద్ధాలు చెప్పి న అబద్ధాల యాత్ర అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏం చేస్తున్నదో చెప్పకుండా కేసీఆర్ను తిట్టడమే వారి విధిగా సభను నిర్వహించారని అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించే ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలను అభినందించడంతో పాటు ఇలాంటి పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేయాలని రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్న మాటలను గుర్తుచేశారు. హరితహా రం.. తాము చేపట్టిన కార్యక్రమమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 8 శాతం గ్రీనరీ తెలంగాణలో పెరిగిందన్నారు. యువతను రెచ్చగొడుతూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. వడ్లు కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తే నూకలు తినుండ్రి అని హేళన చేయడం కేంద్ర మంత్రుల చేతగాని తనానికి నిదర్శనమన్నారు. కేంద్రం పెట్రో ధరలతోపాటు వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై ఆర్థికభారం మోపుతోందని మండిపడ్డారు. పేద, మధ్య తరగతి ప్రజలు, కులవృత్తుల వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దేశంలో 57 మెడికల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు మంజూరైతే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశంలోనే హైదరాబాద్లో ని గాంధీ దవాఖాన ఉత్తమ సేవలు అందించిందన్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులకు బస్చార్జీలు ఇవ్వడంతో పాటు ఉచిత భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం చార్జీలు లేకుండా వారిని స్వస్థలాలకు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం యాత్రలు చేపడుతున్నదని ఆరోపించారు. సంగ్రామ యాత్రలో బీజేపీ కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నదని, కాంగ్రెస్ పార్టీ ఊసెత్తకపోవడంలో మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. రెచ్చగొట్టే పార్టీలు, విధ్వంసం సృష్టించే వారిని నమ్మొద్దని యువతకు సూచించారు. సమావేశంలో జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మొయినుద్దీన్, తాడ్వాయి, సదాశివనగర్ జడ్పీటీసీలు రమాదేవి, రవి, ఎంపీపీ రవి, డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్రెడ్డి, రామారెడ్డి సర్పంచ్ సంజీవ్, కాలభైరవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్గుప్తా, సీనియర్ నాయకులు శంకర్, శివాజీరావు, ధర్మారెడ్డి, బుచ్చన్న, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.