బాన్సువాడ, మార్చి 22 : యువత తమ భవిష్యత్తును కాపాడుకోవాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇటీవల కొందరు విద్వేషాలు రెచ్చగొడుతూ పక్కదారి పట్టిస్తున్నారని, విద్యార్థులు ఎటువంటి రాజకీయాలకు వెళ్లకుండా చదువుపై దృష్టిసారించాలన్నారు. సమాజానికి విద్య ఎంతో అవసరమన్నారు. మనిషికి గొప్ప ఆస్తి చదువే అని పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలలు, ఉర్దూ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వార్షికోత్సవానికి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు రూ. 2.38 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవంలో స్పీకర్ మాట్లాడారు. ఆడబిడ్డలకు చదువు ఎంతో అవసరమని, జ్ఞానంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ ప్రాంతంలోని ఆడబిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి బాన్సువాడలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. రూ. 40 కోట్లతో నర్సింగ్ కళాశాల, హాస్ట ల్ భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ , ఎస్టీ, బీసీ, బాలికల వసతి కోసం పోస్టు మెట్రిక్ హాస్టల్ నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 80వేల ఉద్యో గ ఖాళీలను భర్తీ చేయనుండగా, మరో 11వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేస్తుందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకు దక్కుతాయని చెప్పారు.
బాన్సువాడ జూనియర్ కళాశాల (ఉర్దూ మీడియం) భవనం కోసం రూ.75 లక్షలు మంజూరు చేయించినట్లు స్పీకర్ తెలిపారు. విద్యార్థుల కోరిక మేరకు ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా బాన్సువాడలో ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. హైదరాబాద్లో విదేశాల నుంచి పెట్టుబడులు రాగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. టీఎస్ఐపాస్ ఏర్పాటు చేశాక రాష్ట్రంలో 17,700 పరిశ్రమలు ఏర్పాటైనట్లు తెలిపారు. పరోక్షంగా సుమారు 16 లక్షల మందికి లబ్ధిచేకూరిందన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా స్పీకర్ను కళాశాల అధ్యాపక బృందంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పట్టణానికి చెందిన ఓ వ్యాపారి స్పీకర్ చేతుల మీదుగా గోల్డ్మెడల్ అందజేశారు. ఇదేవేదికపై కళాశాలకు చెందిన అధ్యాపకురాలు సిద్దంశెట్టి రుక్మిణి శేఖర్ రచించిన పుస్తకాన్ని స్పీకర్ పోచారం ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, ఇంటర్మీడియెట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, ప్రిన్సిపాల్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్రిన్సిపాళ్లు పాండురంగం, జయకుమారి, విశాల, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణగుప్తా, ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్రామ్ రెడ్డి, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న బాన్సువాడ నియోజక వర్గంలోని యువత కోసం బాన్సువాడ, వర్నిలో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉచిత భోజన వసతి కల్పించడంతోపాటు పుస్తకాలు, మెటీరియల్ను అందజేస్తామన్నారు. తన చిన్న కుమారుడు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తులు తీసుకొని, ఈ నెల 28 లోపు వివరాలు అందజేయాలని సూచించారు.