భీమ్గల్, మే 14: దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని నంబర్వన్గా నిలిపారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్, గోన్గొప్పుల మధ్య భోగారపు వాగుపై రూ.2.6కోట్లతో హైలెవల్ బ్రిడ్జి, మర్రికాడి ఒర్రె మీద రూ.1.13కోట్లతో బీటీ రోడ్డు, బడాభీమ్గల్లో రూ.కోటితో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శనివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. 60 ఏండ్లల్లో సాధ్యం కాని ప్రగతిని, కేవలం ఏడేండ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో అమలు చేసి చూపిందన్నారు. సాగు రంగానికి ప్రభుత్వం తోడ్పాటునందించిన ఫలితంగా వ్యవసాయ భూముల ధరలు నాలుగింతలు పెరిగాయన్నారు. 2014లో రూ.5లక్షలకు ఎకరం ఉన్న భూమి ధర ప్రస్తుతం రూ.25లక్షల పైచిలుకు పెరిగిందని వివరించారు. వేలాది కోట్లు వెచ్చిస్తూ ప్రాజెక్టులు, చెక్డ్యాములు నిర్మిస్తున్నామని తెలిపారు.
ప్రతి పల్లెలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, గ్రామపంచాయతీలకు నేరుగా నిధులు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇదంతా మీ ఆశీర్వాదంతోనే సాధ్యమైందని మంత్రి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధిని గమనించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలువాలని కోరారు. 57 ఏండ్లు నిండిన వారికి త్వరలోనే పింఛన్లు అందజేస్తామని, సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. మరో రెండు నెలల్లోగా ఇవి అమలులోకి వచ్చే అవకాశాలున్నాయని భరోసా కల్పించారు. కరోనా కారణంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరకపోవడంతో కొంత జాప్యం జరిగిందన్నారు.
చెక్డ్యాం పనుల పరిశీలన
అకాల వర్షాలు, వరదలతో ఇటీవల పాక్షికంగా దెబ్బతిన్న గోన్గొప్పుల చెక్డ్యామ్ను మంత్రి ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. వానకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో చెక్డ్యాం మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ రవి, భీమ్గల్ సొసైటీ చైర్మన్ శివసారి నర్స య్య, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ మలావత్ వెంకటేశ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మొయీజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, వైస్ ఎంపీపీ చింతకింది బావాయి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మనాయక్, జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, సర్పంచులు సంజీవ్, సంధ్య, అనసూయ, జ్యోతి, ప్రతిభ, ఎంపీటీసీలు గంగాధర్గౌడ్, రాజేశ్వర్, ప్రేమలత, టీఆర్ఎస్ నాయకులు హన్మచారి, భూమేశ్వర్, కిషన్ పాల్గొన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమ పథకాల జాడేది?
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా అమలు కా వడం లేదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నా రు. భీమ్గల్ మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్రెడ్డి శనివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, రైతులకు రూ.10వేల పంట పెట్టుబడి సా యం, రూ.5లక్షల రైతుబీమా, ఇంటింటికీ రక్షిత మంచినీరు, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలైతే చూయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలను పెంచి పోషించడం తప్పా బీజేపీ నాయకులు చేసేదేమి ఉండదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్కు దమ్ముంటే రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్షాకు చెప్పి తెలంగాణ తరహా పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయించాలని సవాల్ విసిరారు.
అప్పటి వరకు టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక అర్హత బండి సంజయ్కు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ 50ఏండ్ల పాలనలో జరగని అభివృద్ధి ఏడేండ్ల తెరాస పాలనలో జరిగిందన్నారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన పది ఉత్తమ గ్రామాలు తెలంగాణకు చెందినవేనని, ఈ సర్వేతో అన్ని అంశాల్లోనూ దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నట్లు వెల్లడైందన్నారు. బీజేపీ నేతల రెచ్చగొట్టే మాటలను విశ్వసించకుండా ప్రజలు వాస్తవాలను చూడాలని మంత్రి కోరారు.