నిజాంసాగర్, మే14: రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఓ చాలెంజ్ గా తీసుకొని రానున్న వానకాలం నాటికి గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసి కార్యచరణను ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఎవరికి వారే పది వేల మొక్కలను తయారు చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. ఆరు నెలల కిందట పది వేల మొక్కలను సిద్ధం చేసేందుకు నర్సరీలను ఏర్పాటు చేసింది. ఇందులో కానుగ, వేప, తులసి, మామి డి, సపోట, జామ, టేకు ఇలా వివిధ రకాల విత్తనాలను తీసుకువచ్చి మొక్కలను తయారు చేస్తున్నారు. మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో మాత్రం మొక్కలను తయారు చేసేందుకు విత్తనాలు తీసుకొచ్చారు. మొక్కల కోసం ఏర్పాట్లు చేసినా వాటి పర్యవేక్షణ కరువైంది. మొక్కల జాడ లేకుండా కేవలం ప్లాస్టిక్ కాగితాలే దర్శనమిస్తున్నాయి. పది వేల మొక్కలను తయారు చేయాల్సి ఉండగా ప్రస్తుతం రెం డు వేలకు మించి మొక్కలు లేవు. ఇలా అయితే ప్రభుత్వ లక్ష్యం నీరు గారిపోతుందంటూ గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై ఉపాధి హామీ అధికారులను అడుగగా గతంలో తీసుకువచ్చిన విత్తనాలు మొలకెత్తలేదని, అందుకే మళ్లీ విత్తనాలు తెచ్చామని తెలిపారు.