బాన్సువాడ టౌన్/ వర్ని, మే 6 : శారీరక దృఢత్వంతోనే మానసిక బలం సాధ్యమని, విద్యార్థులు క్రీడలవైపు మొగ్గు చూపాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణపరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో 15 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాడ్మింటన్ క్రీడలకు ఉచిత వేసవికాల శిక్షణ శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. శిబిరానికి వచ్చిన పిల్లలతో కాసేపు వాలీబాల్ ఆడారు. శిబిరానికి కొందరు పిల్లలు ఇబ్రహీంపేట్ నుంచి సైకిల్పై రావడంతో వారిని అభినందిచారు. వేసవి శిక్షణ ఏర్పాటుకు కృషిచేసిన స్టేడియం ఇన్చార్జి నరేశ్ను అభినందించారు. కోచ్ల ద్వారా శిక్షణను ఇప్పించడంతోపాటు శిక్షణ శిబిరం పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేస్తామని తెలిపారు. క్రీడాకారులకు బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ స్పోర్ట్స్ డ్రెస్ను అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ, మాజీ ఎంపీపీ ఎజాస్, కో-ఆప్షన్ సభ్యుడు అలీమొద్దీన్ బాబా, సభాపతి పీఏ భగవాన్రెడ్డి పాల్గొన్నారు.
అభయాంజనేయ స్వామి ఆలయం ప్రారంభం..
వర్ని మండల కేంద్రంలోని వడ్డేపల్లిలో రూ.50 లక్షలతో నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. విగ్రహ పునః ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అఫంది ఫారం వద్ద నిర్మించిన జగదాంబ, సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మీ వీర్రాజు, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, ఉపసర్పంచ్ కంది కృష్ణ, నాయకులు కల్లాలి గిరి, సత్తార్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వినోద్ కుమార్, శ్రీనగర్ సర్పంచ్ రాజు, అంతాపూర్ సర్పంచ్ పద్మా జగ్రాం తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి మృతికి సంతాపం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణ మృతికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని పేర్కొన్నారు.