లింగంపేట, మే 1: కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి అన్ని రంగాల్లో మొండి చెయ్యి చూపిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేంద్రం నేటికీ భర్తీ చేయలేదన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసరల ధరల పెరుగుతున్నాయని అన్నారు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణాకు ఒక్కటి కూడా కేటాయించలేదన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండగా దానిని గుజరాత్కు తరలించారన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపుబోర్డు తీసుకువస్తామని చెప్పి నేటికి తీసుకురాలేదన్నారు. బెంగళూర్ మెట్రోకు రూ.40వేల కోట్లు వెచ్చించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోకు ఒక్క రూపాయి కేటాయించలేదని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వనరులు తీసుకురాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.
లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా..
తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్రానికి ఏడు సంవత్సరాల కాలంలో మూడు లక్షల 65వేల కోట్ల రూపాయలు పన్ను ల రూపంలో చెల్లిస్తే కేంద్రం నుంచి తెలంగాణకు కేవలం లక్షా 68వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారని మం త్రి వెల్లడించారు. తెలంగాణ నిధులు గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాలకు మళ్లించారని దుయ్యబట్టారు. రాష్ర్టానికి రెండు వేలకోట్ల రూపాయలు బీఆర్జీఎఫ్ నిధు లు రావాల్సి ఉందన్నారు. అంతే కాకుండా మూడు వేల కోట్ల రూపాయల ఫైనాన్స్ నిధులు రావాల్సి ఉందన్నారు. తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లేదంటే ఎంపీ పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని కేంద్ర మంత్రులు వెల్లడిస్తున్నా అభివృద్ధికి మాత్రం నిధులు కేటాయించడం లేదన్నారు.
రేవంత్రెడ్డి బుడ్డర్ఖాన్
పదేండ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల సంక్షేమాన్ని విస్మరించి నేడు వరంగల్లో రైతు సదస్సు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి ఒక బుడ్డర్ఖాన్ అని అన్నారు. నాడు రైతు కష్టం పట్టని నాయకులు నేడు సభ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్హయాంలో ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేశారని, కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయని నాయకులు.. నేడు సభ నిర్వహించడం సరికాదన్నారు.