కరీనంగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగం కావాలంటే యువత కష్టపడి చదవాలని, అందుకు తప్పనిసరిగా ఒక ప్రణాళిక ఉండాలని సీఎస్బీ ఐఏస్ఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు సూచించారు. తాను టెన్త్ క్లాస్ వరకు యావరేజ్ స్టూడెంట్నని, ఫోకస్డ్గా చదవడం ప్రారంభించిన తర్వాత సివిల్స్లో ర్యాంకులు వచ్చాయని చెప్పారు. ఈ రోజుల్లో ఉద్యోగాలు అందని ద్రాక్ష కాదనీ, కష్టపడి చదివితే సాధించడం సులువేనని స్పష్టం చేశారు. చదవడంలో ఒక స్టాండర్డ్ మెయింటెన్ చేయాలని, ఎవరితో కంపేర్ చేసుకోవద్దని, మీకు మీరే కాంపిటేటర్లుగా భావించాలన్నారు. ఇప్పటి నుంచి రోజుకు 10 గంటలు అలసట అంటే ఏమిటో తెలియకుండా చదవాలని, చదివిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని నిర్దేశించారు.
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా కరీంనగర్ కేంద్ర గ్రంథాలయం సౌజన్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉద్యోగార్థులకు పోటీ పరీక్షలపై నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సుకు ఆమె ప్రధాన వక్తగా హాజరయ్యారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, అభ్యర్థులనుద్దేశించి మాట్లాడారు. యువత జాబ్ కొట్టాలంటే ఫోకస్డ్గా కష్టపడి చదవాలని, ఆ కష్టం ఎలా ఉండాలంటే మీలా మరెవ్వరూ కష్డపడకూడదు అన్నట్లుగా ఉండాలని సూచించారు. సిలబస్ మొత్తం బట్టీ పట్టకుండా ఒక్కసారి మోడల్ పేపర్స్ పరిశీలించాలని, వాటిని బేస్ చేసుకుని మోడల్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. యూపీఎస్సీ నుంచి గ్రూప్-1, 2 వరకు అన్ని పరీక్షల సిలబస్ను గుర్తించి చదువుకోవాలని, ప్రతి సబ్జెక్ట్కు సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలన్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలను ఎంచుకోవాలని, అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలని సూచించారు. సిలబస్పై అనాలసిస్ ఉంటే ఏ ఉద్యోమైనా సాధిస్తారని స్పష్టం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ఒక్క సీఎంతోనో, మంత్రులతోనో సాధ్యం కాదని, అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే యువతగా మీరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు సాధించి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, తద్వారా బంగారు భారతదేశం నిర్మితమవుతుందని చెప్పారు.
అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్
కరీంనగర్ కేంద్ర గ్రంథాలయం సౌజన్యంతో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా మొదటి సారి కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సు విజయవంత మైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 2 వేల మంది ఉద్యోగార్థులు హాజరు కాగా, టీఎన్జీవోస్ ఫంక్షన్ ప్యాలెస్ కిక్కిరిసింది. పోటీ పరీక్షలపై వేప అకాడ మీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ మల్లవరపు బాలలతతో పాటు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ దిశానిర్దేశం చేశారు. ప్రసంగాలను అభ్యర్థులు ఎంతో శ్రద్ధగా వినడంతోపాటు ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రశ్నా జవాబు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో వారికి ఎదురయ్యే ఇబ్బందుల గురించి అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సదస్సు తమకెంతో ఉపయోగకరంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యం కావాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే అనేక దఫాల్లో 18 వేల పోస్టులు భర్తీ చేసింది. ఇప్పుడు మరో 16 వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 550 ఎస్ఐ క్యాడర్ పోస్టులు ఉన్నాయి. గ్రూప్-1లో 503 పోస్టులుంటే అందులో 91 డీఎస్పీ పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాల్లో చిన్నదా, పెద్దదా అని చూడకుండా అవకాశం వచ్చిన ప్రతి ఉద్యోగానికీ దరఖాస్తు చేసుకోండి. గతంలో మహిళలకు కేవలం 10 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండేవి. ఇప్పుడు 33 శాతం ఇచ్చారు. అమ్మాయిలు పోలీస్ ఉద్యోగం చేయాలా.. వద్దా.. ఇది 30 ఏండ్ల కింది ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నే అవసరం లేదు. ఏ పోలీస్ స్టేషన్లో చూసినా మహిళా కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్లు కనిపిస్తున్నారు. మహిళలు ఎస్ఐలు, సీఐలుగా, డీఎస్పీలుగా రాణిస్తున్నారు. పోలీసు ఉద్యోగాల కోసం ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నది. ఇన్ని సదవకాశాలను వినియోగించుకోండి. ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యం కావాలి. దేనికైనా ఒక ప్రణాళికా ప్రకారంగా చదవండి. ప్రతి ఒక్కరికీ స్టడీ ప్లాన్ ఉండాలి. ఒక్కో సబ్జెక్ట్కు అనేక రకాల పుస్తకాలు కాకుండా ఒకే పుస్తకాన్ని చదవాలి. దానిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. చదివేందుకు షెడ్యూల్, రివిజన్, ప్రాక్టీస్ తప్పనిసరి ఉండాలి. యుద్ధానికి దిగకముందే గెలుపు, ఓటములపై అంచనా వేసుకోవాలి. ఓటమిని ఒప్పుకోకుండా గెలుపు కోసమే ప్రయత్నించాలి.
– సింధూ శర్మ, జగిత్యాల ఎస్పీ
సిస్టమెటిక్ రివిజన్ చేయాలి
సబ్జెక్ట్ చదవడంలో చాలా మందికి కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు లోకాన్ఫిడెన్స్ నుంచి హై కాన్ఫిడెన్స్కు రావడానికి ప్రయత్నించాలి. మీరు పడే కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇన్ని వేల ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం సాధించడం ఖాయం. అకాడమీ పరీక్షలు, పోటీ పరీక్షలకు చాలా తేడా ఉంటుంది. అకాడమిక్ పరీక్షల్లో అర మార్కు చూసీ చూడనట్లు వేసేస్తారు. కానీ, పోటీ పరీక్షలో ఎక్కడ అర మార్కు తప్పు చేశాడో అని చూసి కొట్టి పడేస్తారు. సక్సెస్ కోసం బ్లూ ప్రింట్ అవసరం. ప్రతి ఒక్కరూ బ్లూ ప్రింట్ స్ట్రాటజీ తయారు చేసుకోవాలి. ప్రిపరేషన్ కోసం నాలెడ్జ్, స్కిల్స్తో పాటు ఫిజికల్గా సంసిద్ధులై ఉండాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. ఈ ఉద్యోగం నేను సాధిస్తానన్న నమ్మకం గట్టిగా ఉండాలి. ప్రతి రోజూ మీలో ఫైర్ అనేది రగలాలి.
కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు, చదివినప్పుడు 24 గంటల్లో కేవలం 20 శాతం మాత్రమే గుర్తుంటాయి. మిగతా 80 శాతం మైండ్ నుంచి ఎగిరిపోతాయి. వాటిని కాపాడుకోవాలంటే ఒక సిస్టమెటిక్ రివిజన్ అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం ఐదు సార్లు రివిజన్ చేస్తే మీరు చదివిన, తెలుసుకున్న విషయాల్లో 90 శాతం గుర్తుండి పోతాయి. మీరు చదివిన విషయాలను నోట్ చేసుకోండి. చదివే ప్రతి పేరాగ్రాఫ్లో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రతి విషయాన్ని విజువలైజేషన్ చేసుకోండి. ఒక సినిమా మాదిరిగా గుర్తుంచుకోండి. చదవడంలో టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. నిద్ర నుంచి లేచిన తర్వాత చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుండి పోతాయి. చదివిన ప్రతి విషయాన్నీ సక్సెస్ డైరీలో పొందుపర్చుకోండి. రోజుకు ఒక గోల్ నిర్ణయించుకొని దాన్ని పూర్తి చేయాలి. అప్పుడే మీరు ఎంతో కాన్ఫిడెంట్తో పోటీ పరీక్షలు రాయగలుగుతారు. ప్రభుత్వోద్యోగం సాధించడంలో అందరికంటే ముందుంటారు.
– డాక్టర్ సీఎస్ వేప, వేప అకాడమీ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్
స్నేహ : మేడం.. సిలబస్ ఏ విధంగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది?
బాలలత : ప్రతి విషయాన్ని ముందుగా క్షుణ్ణంగా చదవాలి. బుల్లెట్ పాయింట్ నోట్ చేసుకో వాలి. పెద్ద మ్యాటర్స్ను షార్ట్గా రాసుకోవాలి. ప్రతి రోజూ వంద పదాలు రాసుకోవాలి. నోట్స్ తయారు చేసుకోవాలి. వాటిని ప్రతి రోజూ చదవుకోవాలి.
స్రవంతి : సార్.. నాకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్లగానే భయంగా ఉంటుంది. దీనిని అధిగ మించడం ఎలా.. ?
సీఎస్ వేప : కొందరికి ఇలాంటి భయం ఉంటుంది. కానీ, అది శాశ్వతం కాదు. మంచిగా ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్టులు ఎక్కువగా సాధన చేయాలి. కాన్ఫిడెన్స్ లెవల్స్ని పెంచుకో వాలి. ఈ పరీక్ష నేను నెగ్గ గలను అన్న ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవాలి. అప్పుడు భయానికి దూరమవుతారు.
పట్టుదలతో శ్రమిస్తే ఉద్యోగం సాధ్యం ఎక్కడో ఢిల్లీ, హైదరాబాద్లో చదివిన వాళ్లు గొప్పగా చదువుకుంటారని అనుకోవడం తప్పు. ఇప్పుడు రూరల్ ఏరియాల్లో కూడా మంచి చదువు అందుతున్నది. గ్రామాల్లో చదువుకునే వాళ్లు కూడా గొప్ప ఉద్యోగాలు సాధిస్తున్నారు. నేను కూడా కరీంనగర్లో చదువుకున్నా. గత ప్రభుత్వాల హయాంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో గ్రూప్-1, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. యువతకు ఇంతకన్నా మంచి అవకాశం రాదు. పోటీ పరీక్షలకు నిరుద్యోగులను సన్నద్ధం చేసేందుకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు తమవంతు బాధ్యతగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నాయి. నమస్తే తెలంగాణ నిపుణ పేరిట నాలుగు పేజీల స్టడీ మెటీరియల్ ఇస్తున్నది. తెలంగాణ టుడే ఒక బ్రాడ్ షీట్లో స్టడీమెటీరియల్ అందిస్తున్నది. ఇది అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్