నిజామాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ను సొంత పార్టీ నేతలే నిలదీశారు. శనివారం పార్టీ అంతర్గత సమావేశంలో పలువురు నగర కార్పొరేటర్లు అర్వింద్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఏక వచనంతో ఎదురు దాడి చేయడంతో ఎంపీ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలే పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటికి పొక్కకుండా బీజేపీ నేతలంతా జాగ్రత్త పడుతున్నారు. ఎంపీ వైరి వర్గం ఈ విషయాన్ని బహిర్గతం చేయడంతో సోషల్ మీడియాలో కుమ్ములాట వ్యవహారం హల్చల్ చేస్తోంది. మొదటి నుంచి ఎంపీ వ్యవహార శైలిపై బీజేపీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇష్టారీతిన నోటికొచ్చినట్లు మాట్లాడడం, పార్టీ సిద్ధాంతాలను పాటించకపోవడం వంటి ఘటనలపై పాత తరం నేతలంతా గుస్సా అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి ఎజెండాతో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ బలపడుతోంది. పైగా బీజేపీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. బీజేపీ అంటే ఈసడించుకుంటున్న నేతలంతా గులాబీ పార్టీలోకి రావడంతో దిద్దుబాటు చర్యలకు ముఖ్య నేతలు పూనుకున్నారు. ఇందులో ఎంపీ తన వైఫల్యాలను పక్కన పెట్టి కింది స్థాయి క్యాడర్పై విరుచుకు పడడంతో ఒక్కసారిగా ద్వితీయ శ్రేణి నేతలంతా భగ్గుమన్నట్లు తెలుస్తోంది.
అర్ధాంతరంగా ముగిసిన సమావేశం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ సమావేశం అంతర్గత కుమ్ములాట నేపథ్యంలో అర్ధాంతరంగా ముగిసింది. ఓ ప్రైవేటు కాలేజీని నడుపుతున్న వ్యక్తికి, ఎంపీ అర్వింద్కు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్న తీరుగా గొడవ జరిగింది. సదరు నాయకుడిని మీటింగ్ నుంచి బయటికి వెళ్లాలంటూ ఎంపీ అర్వింద్ హుకుం జారీ చేయగా..‘ నువ్వేంది నాకు చెప్పేదంటూ..’ సదరు నాయకుడు ఎదురు తిరిగాడు. దీంతో సమావేశం ఒక్కసారిగా హీటెక్కి పోవడంతో అంతటితో మీటింగ్ను ముగించాలని నేతలంతా యోచించారు. ‘ఎంపీ హోదాలో జిల్లాకు నువ్వేం చేశావో చెప్పాలంటూ..’ కింది స్థాయి నేతలంతా పట్టుపట్టడంతో అర్వింద్ బిక్కమొఖం వేయాల్సిన దుస్థితి ఏర్పడిందని సమాచారం. మొత్తానికి ఎంపీ అర్వింద్కు సొంత పార్టీ నేతలే ఎదురు తిరగడం ఇప్పుడు బీజేపీలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఎంపీకి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ జరిగిందంటూ కొంత మంది లోలోపల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.