నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 7: నిజామాబాద్ నగరానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల దైవదర్శనానికి వెళ్తూ మాచారెడ్డి మండల శివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. పాంగ్రా బ్యాంకు కాలనీవాసి రాధాకృష్ణాచారి, తన కుటుంబానికి చెందిన మరో ముగ్గురితోపాటు కారు డ్రైవర్ కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో గాయాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచిన విద్యార్థి రాఘవను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం పరామర్శించారు. విద్యార్థి చదువుకు సంబంధించిన వివరాలను కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాఘవకు రూ.2 లక్షల నగదును అందజేసి ఆదుకుంటామని కుటుంబీకులకు భరోసానిచ్చారు. ప్రభుత్వం తరఫున కూడా తగిన సాయం అందించేందుకు కృషిచేస్తానని చెప్పారు.
త్వరగా కోలుకోవాలని, చదువుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, ధైర్యంగా ఉండాలని విద్యార్థికి ధైర్యానిచ్చారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో నగరంలోని గాయత్రీనగర్ నివాసి కారు డ్రైవర్ కూడా మృతిచెందాడని, అతడి కుటుంబాన్ని కూడా ఆదుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందడం చాలా బాధాకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆర్టీసీ చైర్మన్ వెంట ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, కేసీఆర్ సేవాదళ్ రూరల్ సెగ్మెంట్ కన్వీనర్ కోర్వ దేవేందర్, టీఆర్ఎస్ డిచ్పల్లి మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, నాయకులు మధుసూదన్గౌడ్, సత్యనారాయణగౌడ్, రిటైర్డ్ ఎంఈవో రాజాగౌడ్ ఉన్నారు.