గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాలపై అభిరుచి, ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పలు కార్యక్రమాలను చేపడుతున్నది. యేటా ఆసక్తి, అర్హులైన విద్యార్థులను గుర్తించి వారికి అంతరిక్ష పరిశోధనలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది యువ వైజ్ఞాని కార్యక్రమ్ ‘యువికా’ పేరిట కార్యక్రమం నిర్వహిస్తూ భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శిక్షణ ఇవ్వనుండడం విశేషం.
ఇందూరు, మార్చి 29:విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చి భావిశాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇస్రో అవకాశాన్ని కల్పిస్తున్నది. ఇందుకోసం 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ, అప్లికేషన్లపై అవగాహన కల్పించేందుకు, తర్ఫీదు ఇచ్చేందుకు నిర్ణయించారు. ప్రతిభచాటిన వారిని ఎంపిక చేయనున్నారు.
దేశవ్యాప్తంగా ఐదు కేంద్రాలు..
దేశవ్యాప్తంగా ఐదు చోట్ల శిక్షణా కేంద్రాలను నెలకొల్పారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్, బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, షిల్లాంగ్లోని నార్త్-ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ కేంద్రాల్లో విద్యార్థులకు తర్ఫీదునిస్తారు.
మే 16 నుంచి శిక్షణ..
శిక్షణార్థులకు వేసవి సెలవుల్లో మే 16 నుంచి 28 వరకు 13 రోజులపాటు శిక్షణనివ్వనున్నారు. విద్యార్థుల ప్రయాణ ఖర్చులు, బస, భోజన వసతితోపాటు అన్ని ఖర్చులను ఇస్రో భరించనున్నది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుల్లో ఎవరైనా ఒకరికి మాత్రమే ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. ధృవపత్రం సైతం అందించి శ్రీహరి కోటలోని సతీశ్ధావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పించనున్నారు.
గ్రామీణులకే తొలి ప్రాధాన్యం..
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఎనిమిదో తరగతిలో పొందిన మార్కులు, మూడేండ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిల్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్ ప్రతిభ పరీక్ష ఒలింపియాడ్లో పాల్గొని తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిస్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభచాటిన వారు, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లలో సభ్యులుగా ఉండడం, ఆన్లైన్ క్విజ్లో పాల్గొని ప్రతిభచాటిన విద్యార్థులకు ఎంపికలో అవకాశం ఉంటుంది.
ఏప్రిల్ 10 వరకు అవకాశం
యువికా శిక్షణకు విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుది. తొలుత విద్యార్థులు వారి ఈ- మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48గంటల వ్యవధిలో ఇస్రో నిర్వహించే ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయి 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్లోని ఆన్లైన్ దరఖాస్తులో పూర్తి వివరాలను నమోదు చేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి. విద్యార్థి మూడేండ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు పొందుపర్చాలి. దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 10వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఎంపిక జాబితాను ఏప్రిల్ 20న ప్రకటించి అర్హత సాధించిన వారి వివరాలను నేరుగా తెలియజేస్తారు.
విద్యార్థులు ఉపయోగించుకోవాలి..
ఇస్రో శిక్షణకు దరఖాస్తుల ప్రకటన వెలువడింది. చురుకైన, ఆసక్తి ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. భావి శాస్త్రవేత్తలుగా తయారుకావడానికి ఇదో మంచి అవకాశం. నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
-గంగా కిషన్, జిల్లా సైన్స్ అధికారి, నిజామాబాద్