కామారెడ్డి, ఆగస్టు1 : గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా నిలిచిన వరినాట్లు మళ్లీ జోరందుకున్నాయి. రెండో దశ పనుల్లో కర్షకులు బిజీగా ఉన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత వరి, మక్క, పత్తి తదితర పంటలను రైతులు సాగు చేశారు. పది రోజులుగా వరినాట్లు జోరుగా సాగుతున్నాయి.
ఈ సీజన్లో 2.50లక్షల ఎకరాల్లో వరిపంట సాగయ్యే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 85వేల ఎకరాల్లో మక్క పంట సాగుచేసినట్లు వ్యవసాయ శాఖ నివేదికల ద్వారా తెలుస్తున్నది. ఈ వానకాలంలో ఇప్పటికీ 2,48,150 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. 7,104 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వీటిలో 1,68,742 ఎకరాల్లో సన్న రకం, 79,408 ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగయ్యే అవకాశముందని అంచనా వేశారు.
86,205 ఎకరాల్లో మక్క, 300 ఎకరాల్లో జోన్న, 22,151 ఎకరాల్లో కందులు, 10,500 ఎకరాల్లో మినుము, 73,545 ఎకరాల్లో పత్తి, 108 ఎకరాల్లో బబ్బెర్లు, 72,878 ఎకరాల్లో సోయాబీన్, 4,100 ఎకరాల్లో చెరుకు, 1,000 ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసినప్పటికీ దీనికంటే అధికంగా సాగు కానుంది. గత సీజన్లో 2,18,300 ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేయగా, 2,78,877 ఎకరాల్లో సాగైంది.
ఈసారి వరి, పత్తి, సోయాబీన్ పంటల సాగు విస్తీర్ణం గతేడాది కంటే పెరగనుంది. జిల్లా వ్యాప్తంగా పది రోజుల్లో 40వేల ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్లో 2.50లక్షల ఎకరాల్లో సాగువుతుందని భావిస్తుండగా, 2.70లక్షల ఎకరాలకు పెరిగే అవకాశముంది. జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, జుక్కల్, బిచ్కుంద, కామారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్ తదితర మండలాల పరిధిలో వరినాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 1.15లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. వరి నాట్ల కోసం ఇతర రాష్ర్టాల నుంచి కూడా జిల్లాకు కూలీలు వచ్చారు.
గతేడాది జిల్లాలో వానాకాలం సీజన్లో 5,16,066 ఎకరాల్లో పంట సాగు చేశారు. ఈ సీజన్లో 5,36,941 ఎకరాల్లో పంట సాగుకు అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. గతేడాది కంటే ఈసారి పంటల సాగు మరింత పెరిగే అవకాశం కనపడుతున్నది. జిల్లాలో నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులతో పాటు చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులు, బోరు బావుల కింద వరి సాగు సాగుచేస్తున్నారు.
ఈ సీజన్లో 2,48,150 ఎకరాల్లో వరి పంట సాగుతో పాటు మరో 7,104 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వీటిలో 1,68,742 ఎకరాల్లో సన్న రకం వరి సాగు, 79,408 ఎకరాల్లో దోడ్డు రకం వడ్లను సాగు చేస్తారని అంచనా వేశారు. గత వానకాలం సీజన్లో 2,18,300 ఎకరాలకు సాగు చేస్తారనీని అంచనా వేయగా, 2,78,877 ఎకరాల్లో వరి పంట సాగైంది.
ఈసారి వరి, పత్తి, సోయాబీన్ పంటల విస్తీర్ణం గతేడాది కంటే పెరగనుంది. గతేడాది జిల్లాలో వానకాలంలో 54 ఎకరాల్లో జొన్న, 92,716 ఎకరాల్లో మక్క, 18,537 ఎకరాల్లో కందులు, 10,810 ఎకరాల్లో పెసర్లు, 10,345 ఎకరాల్లో మినుములు, 108 ఎకరాల్లో బబ్బర్లు, 27,591 ఎకరాల్లో పత్తి, 71,130 ఎకరాల్లో సోయాబీన్, 5,629 ఎకరాల్లో చెరకు సాగు చేశారు. 2020-21 సీజన్లో 2,47,851 ఎకరాల్లో వరి సాగైంది.
జిల్లాలో సాధారణ వర్షపాతం సోమవారం నాటికి 424.3 మిల్లీ మీటర్లు కాగా ఇప్పటి వరకు 772 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు 82 శాతం అధికంగా కురిసింది. గతేడాది 1029 మిల్లీమీటర్లకు గాను 1248.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్లో 155.8 మిల్లీమీటర్ల వర్షానికి గాను 187 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూలైలో 252.8 మిల్లీమీటర్లకు గాను 577.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
జూలైలో 128.4 శాతం అధిక వర్షపాతం కురిసింది. జిల్లాలో 22 మండలాలకు గాను 20 మండలాల పరిధిలో 60 శాతం కంటే ఎక్కువ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 50 శాతం మేరకు మరో రెండు మండలాల పరిధిలో వర్షాలు కురిశాయి. జిల్లా పరిధిలో మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి మట్టానికి చేరి దిగువకు నీటి విడుదల కొనసాగతోంది.
నిజాంసాగర్, పోచారం, కౌలాస్నాల నుంచి గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగులు పారుతుండగా, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. జిల్లాలో వర్షాలు కురుస్తునే ఉన్నాయి. మరో మూడు నెలల పాటు వానాకాలం సీజన్ ఉంది. ఇప్పటికే 90 శాతం మేరకు చెరువులు, కుంటలు నిండాయి.