ఇందూరు, ఆగస్టు 1: తెలంగాణ విశ్వవిద్యాలయం, అల్ట్రాసోనిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంశంపై నిర్వహించే సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. నగర మేయర్ దండు నీతూ కిరణ్, టీయూ ఉపకులపతి ఆచార్య డాక్టర్ రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ శివశంకర్, ప్రిన్సిపాల్ ఆరతి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నీతూకిరణ్ మాట్లాడుతూ నిజామాబాద్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో పురోభివృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు.
దేశ విదేశాల నుంచి వివిధ రంగాల్లో కృషి చేసి వారు నిజామాబాద్కు రావడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కాన్ఫరెన్స్ నిర్వహణలో ఒక సంకల్పం, ఒక ఆశయం ఉందన్నారు. ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ మాట్లాడుతూ సదస్సు నిర్వహణతో అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్పై నూతన ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. జర్మనీ, ఫ్రాన్స్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీతలు ఐ పాడ్స్ మీద విస్తృత పరిశోధనలు చేసి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధిని సాధించి పెట్టారన్నారు. గ్రావిన్ బ్యాటరీల మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.
ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్న విదేశీ ప్రతినిధులు ఒక్కో శాస్త్ర రంగంలో ప్రావీణ్యం సాధించారన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో విస్తృతమైన అధ్యయనం, ఉన్నతమైన పరిశోధన, నూతన ఆవిష్కరణలపై అవగాహన కలిగిస్తారన్నారు. అల్ట్రాసోనిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆచార్య రాజారాం యాదవ్ మాట్లాడుతూ ఆల్ట్రాసోనిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభం నుంచి శాస్త్ర, సాంకేతిక రంగంలో పురోభివృద్ధి సాధించిందన్నారు. అమెరికా రోషన్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ రామానుజాచారి మాట్లాడుతూ మారుతున్న కాలానికి శాస్త్ర సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు అవసరమన్నారు. శాస్త్ర సాంకేతిక ప్రగతి పథంలో అల్ట్రాసోనిక్స్ మెటీరియల్ సైన్స్ అవశ్యకత ఎంతో ఉందన్నారు.
డీఆర్డీవో సైంటిస్ట్ సంగీత కాలే మాట్లాడుతూ అడ్వాన్స్డ్ మెటీరియల్పై ఈ కాన్ఫరెన్స్ ప్రాధాన్యమిస్తున్నదన్నారు. నెట్వర్కింగ్, సైన్స్ రూట్స్పై సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశమున్నదన్నారు. బీఆర్కె.మూర్తి మాట్లాడుతూ దేశంలో ఇంజినీరింగ్ టెక్నాలజీ సొసైటీ, మద్రాస్ ఐఐటీ మెడికల్ సైన్స్ వంటివి వివిధ ప్రభుత్వ అనుబంధ సంస్థలు శాస్త్ర, సాంకేతిక శాస్త్రంలో కృషి చేస్తూ పరిశోధించడంలో ముందుకు వస్తున్నాయన్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన డాక్టర్ శ్రీకాంత్ జొన్నలగడ్డ గ్రీన్ సింథసైస్ మీద పరిశోధనలు జరుగుతున్న నేపథ్యాన్ని వివరించారు.
సదస్సు ప్రారంభ సమావేశంలో కన్వీనర్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వాసం చంద్రశేఖర్, క్యాలిఫోర్నియా నుంచి వచ్చిన ప్రొఫెసర్ సుభాష్ జొన్నలగడ్డ, డాక్టర్ లుకాస్ సోలాన్, డాక్టర్ బ్రియాన్ పెంక్జుక్, గుజరాత్ నుంచి ప్రొఫెసర్ డి.జి. కుబేర్కార్, ప్రిన్సిపాల్ ఆచార్య సీహెచ్.ఆరతి, డీన్ ఆచార్య అరుణ, అల్ట్రాసోనిక్స్ సొసైటీ జనరల్ సెక్రటరీ డాక్టర్ యుదిష్టర్ కుమార్ యాదవ్, స్థానిక ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సత్యనారాయణ మావురపు, పాలకమండలి సభ్యులు ఆచార్య నసీం, డాక్టర్ రవీందర్రెడ్డి, డాక్టర్ ప్రవీణ్కుమార్, నిశిత కళాశాల యాజమాన్యం రాజు, ఉషోదయ కళాశాల యాజమాన్యం సూర్యప్రకాశ్ రావు, ఆచార్య పి.కనకయ్య, ఆచార్య బి.విద్యావర్ధిని, డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సంపత్కుమార్, డాక్టర్ వి.త్రివేణి, అధ్యాపకులు పాల్గొన్నారు. సదస్సులో నిర్వహించిన సాంస్కృతిక, జానపద, చిందు, పేరిణి తదితర నృత్యప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.