నిజామాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)నిజామాబాద్లో రానున్న తరంలో సహజ ప్రసవాలతో ఆరోగ్యంగా ఉన్న మహిళలే ఉండాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇష్టానుసారంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్న జిల్లాల్లో మన జిల్లా ముందు వరుసలో ఉండడం దురదృష్టకరమని చెప్పారు. వారం రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇదే అంశంపై సమీక్షా సమావేశంలో సీరియస్గా స్పందించారు.
ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలకు వచ్చే మహిళలకు సహజ కాన్పులు చేసేందుకు మొగ్గు చూపాలని ఇందుకోసం వారిని ప్రోత్సహించాలని చెప్పారు. ఇందులో భాగంగా కలెక్టర్ కొద్ది రోజులుగా ఆయా వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి వైద్యుల నుంచి సలహాలు, సూచనలు సైతం స్వీకరించారు. మరోవైపు ఎడాపెడా శస్త్ర చికిత్సలు చేస్తున్న దవాఖానల యాజమాన్యాలు, వైద్యులను గట్టిగానే హెచ్చరించినట్లుగా గురువారం మీడియాతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
మహూర్తాలు చూసుకొని కాన్పులు చేయించుకునే సంస్కృతిని ప్రజలు విడనాడాలని కలెక్టర్ సూచించారు. పుట్టబోయే బిడ్డ, జన్మనిచ్చే మాతృమూర్తి ఆరోగ్యమే కుటుంబీకులకు ప్రథమ కర్తవ్యంగా ఉండాలని చెప్పారు. సమయం, రోజులను చూసుకోవడం ద్వారా మాతా శిశు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా కాన్పు సమయానికి తగ్గట్లుగా వైద్య నిపుణులను సంప్రదించి సహజ కాన్పులకు ప్రయత్నించాలని కోరారు.
శస్త్ర చికిత్సల ద్వారా తల్లులు మూడు నెలల వరకు ఎలాంటి పనులు చేయలేక పోతున్నారన్నారు. సహజ కాన్పుల్లో మహిళలు మూడు రోజుల్లోనే తమ కార్యకలాపాల్లో మునిగిపోవచ్చన్నారు. వైద్యులు సైతం ముహూర్తాలతో వచ్చే వారికి అవగాహన కల్పించాలని కోరారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో ఆపరేషన్లను తప్పించలేమని, అలాంటి వారికి శస్త్ర చికిత్స ద్వారానే తల్లీబిడ్డలను సంరక్షించడం ముఖ్యమన్నారు.
మొదటి కాన్పు ఆపరేషన్ జరిగితే రెండోసారి ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మొదటి కాన్పు సహజంగానే జరిగితే రెండో కాన్పు తప్పనిసరిగా నార్మల్ డెలివరీ చేయాలన్నారు. సహజ కాన్పులకు సమయం ఎక్కువ తీసుకున్నప్పటికీ ఈ విషయంలో గర్భిణికి సంబంధించిన బంధువులు, వైద్యం చేసే డాక్టర్లు అందరూ కలిసి మనోధైర్యం కల్పించాలన్నారు. ఉత్తర తెలంగాణలోనే ఇలాంటి పరిస్థితులు ఉండగా నిజామాబాద్లో భారీగానే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు.
ప్రజలు, వైద్యులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని 75శాతం జరుగుతున్న శస్త్ర చికిత్సలను భారీగా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రాస్ రూట్స్ నుంచి అవగాహన పెంచాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తున్న సమయంలో ప్రైవేటు దవాఖానల్లో జరగరాని ఘటనలు జరిగితే వైద్యులపై దాడులు జరుగుతున్న విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ విషయంలో ప్రైవేటు వైద్యశాలలు, వైద్యులకు రక్షణగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఇష్టానుసారంగా కాన్పులు నిర్వహించారని కలెక్టర్ అన్నారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్లు అనవసరంగా జరిగేందుకు అవకాశమే లేదన్నారు. ప్రతి రోజు తనిఖీలు చేపట్టడంతో పాటు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. పేషెంట్కు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఆపరేషన్ చేయాల్సి వస్తే అందుకు గల కారణాలను విశదీకరించాల్సిన బాధ్యత సంబంధిత వైద్యులదేనన్నారు.
లేదంటే జూలై నెల నుంచి అత్యధికంగా ఆపరేషన్లు చేసే దవాఖానలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే దవాఖానల ముందు ఆపరేషన్లు జరిగిన వివరాలను పెట్టి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. తద్వారా దవాఖానకు చెడ్డ పేరు వస్తుందని, ఆ పరిస్థితిని యాజమాన్యాలు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
ప్రభుత్వానికి తల్లీ బిడ్డ ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు వైద్యశాలల్లో దారుణమైన దుస్థితి కనిపిస్తోందని తెలిపారు. వందకు వంద శాతం ఆపరేషన్లు చేస్తున్న దవాఖానాలుండడం చూసి ఆశ్చర్యపోయామన్నారు. కొన్ని ప్రైవేటు దవాఖానలు డబ్బులు పెద్ద మొత్తంలో సంపాదించవచ్చనే ఆలోచనతోనే ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ చెప్పారు. ఈ తీరు సరికాదన్నారు.