శక్కర్నగర్, జూన్ 23:నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో 108 అంబులెన్స్ ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు, వైద్యులు, అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రమాదస్థలం నుంచి క్షతగాత్రులను తరలిస్తూ, వారికి ప్రాథమిక చికిత్స అందిస్తూ, మిగతా చికిత్సల కోసం దగ్గర్లోని దవాఖానలకు చేరవేస్తున్నారు. అయితే, బోధన్ ప్రాంతంలోని 108 సేవలకు ఓ ప్రత్యేకత ఉన్నది. గతంలో బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో నెలకు 200 వరకు ప్రసవాలు చేసేవారు.
కాగా, దవాఖానలో మహిళలకు ప్రసవాలు జరిపించేందుకు గైనకాలజిస్టు లేకపోవడంతో పలు కేసులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రిఫర్ చేసేవారు. ఇలాంటి సంఘటనల్లో 108లో సదరు గర్భిణులను నిజామాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే నొప్పులు అధికమై పురుడు పోసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఇలాంటి సంఘటనల్లో సదరు కుటుంబీకులు, వైద్యులు 108 సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసిస్తున్నారు. ఇటీవల కాలంలో బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో కాన్పులు చేసేందుకు వైద్యురాలు నియామకం కావడంతో కొంతమేరకు సౌలభ్యంగా మారింది. బోధన్ ప్రాంతంలో 108 అంబులెన్స్ అందిస్తున్న సేవలతో ‘ప్రసవాల సంచార వైద్యశాల’గా పలువురు అభివర్ణిస్తున్నారు.
అస్వస్థతకు గురైనా.. కండ్లముందు ఎవరైనా మృత్యువుతో పోరాడుతున్నా ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకువచ్చే అపర సంజీవని 108 అంబులెన్స్. ఫోన్ చేసిన 15 నిమిషాల్లో ప్రథమ చికిత్సకు సంబంధించిన పూర్తి సరంజామాతో వాలిపోయి.. ప్రాణాలను కాపాడి జీవితాలను నిలబెడుతున్న ప్రాణదాత ఈ వాహనం. ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ 108.. గర్భిణుల పాలిట ప్రసవాల దవాఖానగా మారి పురుడుపోస్తున్నది. అందరికీ అండగా ఉంటూ ఆపద్బంధుగా నిలుస్తున్నది.
108లో 15ఏండ్ల కాలంగా టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నా. మేము అందించే సేవలకు కుటుంబీకులు, వైద్యుల నుంచి అందుతున్న అభినందనలు, ప్రశంసలు మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఫోన్కాల్ వచ్చిందంటే సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటాం. క్రిటికల్ పరిస్థితుల్లో సంబంధిత వైద్యుల సూచనల మేరకు కాన్పులు చేస్తుంటాం. గర్భిణులను ప్రభుత్వ దవాఖానలకు తరలించే క్రమంలో నొప్పులు అధికమై వారికి పురుడుపోస్తున్న సంఘటనలో వారి కుటుంబీకుల ప్రశంసలు, ఆత్మీయ పలుకరింపులు మా వైద్య బృందం అందిస్తున్న సహకారం స్ఫూర్తినిస్తున్నది.
-సురుకుట్ల లక్ష్మణ్, టెక్నీషియన్
ఫోన్కాల్ వచ్చిన వెంటనే సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటాం. దవాఖానకు చేర్చేలోపు మా వంతుగా మెరుగైన సేవలు అందించడంతో పాటు వారికి సకాలంలో వైద్య చికిత్సలు అందేలా చర్యలు చేపడుతున్నాం.108లో విధులు నిర్వహించడం సంతృప్తికరంగా ఉంది.
-డి.కేశవ కుమార్, పైలట్