వర్ని, జూన్ 23: సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా ప్రతి గుంటకూ సాగు నీరందేలా నిర్మాణం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని సిద్దాపూర్ గ్రామంవద్ద రూ.120 కోట్లతో చేపట్టిన సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. రిజర్వాయర్ వద్ద ఎన్ని మీటర్ల ఎత్తున నీళ్లు నిలుస్తాయి, కట్ట ఎత్తు ఎంత, నాణ్యత వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆయకట్టు రైతులకు ప్రతి ఒక్కరికీ సాగు నీరందేలా కాలువ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. కాలువలను తవ్వే సమయంలో స్థానిక రైతులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్పీకర్ వెంట వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, మండల కో- ఆప్షన్ సభ్యుడు కరీం, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సింగంపల్లి గంగారాం, టీఆర్ఎస్ నాయకుడు మేక వీర్రాజు, కల్లాలి గిరి, బర్దావల్ దశరథ్, శ్రావణ్ కుమార్, రమాదేవి, తహసీల్దార్ విఠల్ తదితరులు ఉన్నారు.
బీర్కూర్, జూన్ 23 : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని భైరాపూర్, మల్లాపూర్ గ్రామాలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం రానున్నట్లు జడ్పీటీసీ మాజీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని భైరాపూర్ గ్రామంలో 80 డబుల్ బెడ్ రూం ఇండ్లు, మల్లాపూర్ గ్రామంలో 51 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారన్నారు.
ఆ ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు స్పీకర్ ఉదయం 9 గంటలకు రానున్నారని తెలిపారు. ఉదయం మల్లాపూర్ గ్రామానికి చేరుకొని అక్కడి నుంచి భైరాపూర్ గ్రామంలో ఇండ్లను ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమాలకు మండలంలోని ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.