డిచ్పల్లి, జూన్ 23: పోటీ పరీక్షల కోసం సబ్జెక్టుపై కన్నా సిలబస్పై ఎక్కువ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. ఎన్ని గంటల పాటు చదివామని కాకుండా ఎంత ఏకాగ్రతతో చదివామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. ఒత్తిడులను సృష్టించుకోవద్దని ఉద్యోగార్థులకు సూచించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పోటీ పరీక్షల శిక్షణా విభా గం ఆధ్వర్యంలో న్యాయ కళాశాలలోని సమావేశ మందిరంలో గ్రూప్-1 తదితర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ముఖ్యఅతిథిగా హాజరై ఉద్యోగార్థులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్యోగాలు ‘నభూతో నభవిష్యతి’అని అన్నారు. ఇది ఉద్యోగాల యుగమని అభివర్ణించారు. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక యుగంతోపాటు ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ యుగం నడుస్తోందన్నారు. మానవుడి సమగ్రాభివృద్ధి అంతా కండబలం, బుద్ధిబలం మీద నిర్మాణమవుతుందన్నారు. ఓటమి జీవితంలో ఎదురవుతూనే ఉంటుందని, దానికి భయపడకుండా ముందడుగు వేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థుల నిష్పత్తి 1: 25 మాత్రమే ఉందన్నారు. మనమెన్నో ఆటుపోట్లు, ప్రకృతి వైపరీత్యాలు, ఆకస్మికంగా పుట్టుకొచ్చే అనేక వైరస్లను తట్టుకొని ఎదురీదుతున్నామన్నారు. వాటి ముందు చూస్తే ఈ ఉద్యోగాలు సాధించడం అంత కష్టమైన పని కాదన్నా రు. మన శిల్పాన్ని మనమే చెక్కుకోవాలన్నారు. ఎవరైనా ప్రేరణ, స్ఫూర్తి, ఉత్సాహం, ప్రోత్సాహం మాత్రమే అందిస్తారని అన్నారు. అన్నింటి కన్నా ఆత్మైస్థెర్యం, విశ్వాసం గొప్పదన్నారు. కానీ గర్వం పనికి రాదన్నారు. మానవ సాధన ఒక గాలిపటం లాంటిదన్నారు.
ఒక కక్ష్యలోకి వెళ్లిన తర్వాత దాని పతనానికి అవకాశం ఉండదన్నారు. ఉద్యోగ సా ధన కూడా అలాంటిదేనన్నారు. ఒక్కసారి ఒక ఉ ద్యోగంలో అడుగు పెడితే చాలు అనేక మెట్లను అధిగమించగలుగుతామన్నారు. లక్ష ఉద్యోగాల్లో యువతరం స్థిరపడుతున్న నేపథ్యంలో ఒక ట్రెండ్ ఏర్పడుతుందన్నారు. యువత ఆలోచన విధానం, సృజనాత్మక శక్తి, సామాజిక నిబద్ధత, సమాజాన్ని కొత్త కోణంలో వృద్ధిపర్చాలని సంకల్పమనేవి ఈ ఉద్యోగాల భర్తీలో ప్రతిఫలించే అంశాలన్నారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, రాజనీతి, సాహిత్యం, ఫిలాసఫీ, జాగ్రఫీ వంటివి పోటీ పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్నలుగా అడుగుతారో వివరించారు. ప్రతి ఒక్కరూ ఆర్ఆర్ఆర్ (రీడింగ్, రిమెంబర్, రివిజన్) పద్ధతిని అనుసరించాలని చమత్కరించారు. చదువు కష్టమనే భావన నుంచి బయట పడాలన్నారు. తక్కువ పుస్తకాలు చదివినా.. ఎక్కువ మననం చేసుకోవాలన్నారు.
నిరాశ, నిస్పృహలను దరి చేరనివ్వకుండా తాము ఎలాగైనా సాధిస్తామని గట్టి సంకల్పంతో కష్టపడితే ఆశించిన లక్ష్యం దానంతట అదే వరిస్తుందని అ న్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో యువత కోరుకున్న కొలువులు దక్కించుకుని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడంతో అనవసర అపోహాలకు ఆస్కారం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో వీసీ డి.రవీందర్, ఆత్మీయ అతిథి కె.శివశంకర్, ఆర్డీవో రవి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ప్రిన్సిపాల్ ఆరతి, డైరెక్టర్ బాలశ్రీనివాసమూర్తి, రవీందర్రెడ్డి, త్రివేణి, మహేందర్రెడ్డి, ప్రసన్నరాణి, స్రవంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.