నిజామాబాద్ క్రైం, జూన్ 23 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసింది. పోలీసులు,స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన సాయికుమార్, భాను, ప్రభాకర్, విష్ణు, సాయికృష్ణ ఐదుగురు స్నేహితులు కలిసి బుధవారం రాత్రి రైల్వే స్టేషన్ ఏరియాలో టీతాగేందుకు ఆటోలో బయల్దే రారు. వర్ని రోడ్డు చౌరస్తా వద్ద వీరి ఆటో ముందు రెండు బైకులపై ఆరుగురు యువకులు వెళ్తున్నారు. సైడ్ ఇవ్వకపోవడంతో ఆటోలో ఉన్న యువకులు హార న్ కొట్టారు.
ఇంతలో తమ వెనకాల నుంచి అంతగా హారన్ ఎందుకు కొడుతున్నారంటూ బైక్పై ఉన్న అజ్జుఖాన్ అతని అనుచరులు ఆటోలో ఉన్న సాయికుమార్తో గొడవకు దిగారు. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు, బైకులపై ఉన్న ఆరుగురి మధ్య గొడవ చోటు చేసుకున్నది. దీంతో అజ్జుఖాన్ తన స్నేహితులతో కలిసి సాయికృష్ణ, విష్ణును కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయారు. గాయాలపాలైన ఇద్దరిని తోటి స్నేహితులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. బాధితుల ఫిర్యాదుతో ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్లో అజ్జుఖాన్, సలామ్ చావూస్, జుబేర్, ఖజా, షదాబ్, షేక్ అఫ్రోజ్పై హత్యా యత్నం కేసు నమోదు చేశారు.
ఘర్షణ సమయంలో యువకుల వద్ద మారణాయుధం ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గొడవ జరుగుతున్న సమయంలో వారికి ఎవరైనా కత్తి తీసుకువచ్చి ఇచ్చారా లేక యువకులు తమ వెంట కత్తి పెట్టుకుని తిరుగుతున్నారా అనే పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం విచారణ చేపట్టారు.
కత్తిపోట్ల ఘటనను సీపీ నాగరాజు సీరియస్గా పరిగణించినట్లు సమాచారం. దాడి చేసిన నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. దీంతో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ పర్యవేక్షణలో సౌత్ రూరల్ సీఐ నరేశ్ ఆధ్వర్యంలో ఐదవ టౌన్ ఎస్సై కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలో రౌడీయిజం,అల్లర్లు అనే మాట వినిపించకుండా పాత నేరస్తులు, రౌడీలను కట్టడి చేసేందుకు సీపీ నాగరాజు ఆరునెలలుగా ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం శాంతియుత వాతవరణం నెలకొన్నదని పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కత్తిపోట్ల సంఘటన జరగడంతో సీపీ కింది స్థాయి సిబ్బందిపై మండిపడినట్లు సమాచారం.