అమ్మ ఒడి పథకం ఉమ్మడి జిల్లాలో అద్భుత ఫలితాలనిస్తున్నది. బాలింతలు, గర్భిణులకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నది. గర్భిణులు దవాఖానకు రావడానికి ప్రతికూలంగా మారిన రవాణా ఇబ్బందులను తీర్చడానికి కేసీఆర్ సర్కారు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చింది. 102కు డయల్ చేయగానే ప్రత్యేక వాహనాలు గర్భిణులు, బాలింతల ఇండ్ల వద్ద నిమిషాల వ్యవధిలో వాలిపోతున్నాయి. పైసా తీసుకోకుండా దవాఖానకు తీసుకెళ్లి వైద్యం చేయించిన తర్వాత ఇంటి వద్ద దిగబెడుతున్నాయి. 2018లో ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన 102 వాహనాలు ఇప్పటికే లక్షా 10వేల ట్రిప్పులు తిరిగి రెండు లక్షల మందికి పైగా సేవలందించాయి.
నిజామాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):మాతా, శిశు సంరక్షణలో భాగంగా గర్భిణులకు ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత సేవలు అందుతున్నాయి. దవాఖానకు వచ్చేందుకు ప్రతికూలంగా మారిన రవాణా ఇబ్బందులను తీర్చేందుకు 102 అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం 2016, డిసెంబర్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. సత్ఫలితాలు రావడంతో కొద్దిరోజులకే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం విస్తరించింది.
వాహనాలను ప్రవేశపెట్టడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సత్ఫలితాలు నమోదు అవుతున్నాయి. 102 ప్రత్యేక వాహనాల్లో గర్భిణులతోపాటు వారికి సహాయకులుగా వచ్చేవారు సైతం కూర్చునే వీలున్నది. అల్ట్రా స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలకు రిఫర్ చేసిన గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సీహెచ్సీకి లేదా దగ్గర్లోని ఏరియా దవాఖానకు తీసుకెళ్తారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి తీసుకొస్తారు.
మధ్యలో ఎప్పుడైనా ఏదైనా వైద్య పరీక్ష అవసరమని గుర్తిస్తే దవాఖానకు తీసుకెళ్లి వైద్య సేవలనంతరం ఇంటి వద్ద దించుతారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలకు చేయించుకున్న గర్భిణులను ముందుగానే ప్రసవ తేదీని వైద్యులు నిర్ణయిస్తారు. ఆ విషయాన్ని 102 వాహనం సిబ్బంది, గర్భిణికి ముందుగానే సమాచారాన్ని అందిస్తారు. పక్కాగా, పకడ్బందీగా అమలవుతున్న ఈ పథకం ఉమ్మడి జిల్లాలో లక్ష ట్రిప్పులకు చేరువైంది. దాదాపుగా 2లక్షల మందికి సేవలందించింది.
రాష్ట్రంలో మాతా, శిశు సంరక్షణకు పెద్ద పీట దక్కుతున్నది. సీఎం కేసీఆర్ పరిపాలన బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేశారు. ఇందులో భాగంగా సర్కారు దవాఖానల్లో వసతులు మెరుగుపర్చడంతోపాటు నిష్ణాతులైన నిపుణులను అందుబాటులోకి తీసుకువచ్చారు. వివిధ మార్గాల్లో గ్రామాల్లో, పట్టణాల్లో పేద కుటుంబాలకు చెందిన గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు వినూత్నంగా కార్యక్రమాలు అమలు చేశారు. అంగన్వాడీల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయించారు. ప్రైవేటులో ప్రసవాలు చేయించుకోవడం ద్వారా ఆర్థికంగా కుటుంబాలు చితికి పోతుండడంతో కేసీఆర్ కిట్ పథకాన్ని సీఎం తీసుకువచ్చారు. నగదు ప్రోత్సాహంతోపాటు బాలింతకు రూ.2వేలు విలువ చేసే కిట్ అందివ్వడం ద్వారా సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నానుడి కాస్తా.. నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకు అన్న చందంగా రూపాంతరం చెందింది. కాబోయే అమ్మలకు ఉచిత సేవలందించడానికి ప్రవేశపెట్టిన 102 అమ్మఒడి రోజురోజుకూ విస్తరిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మఒడి పథకానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఈ సేవలు దరిచేరుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 2018లో పథకం అందుబాటులోకి వచ్చింది. నిజామాబాద్లో మొత్తం 43,500 ట్రిప్పులకు 98వేల మందికి ప్రయోజనం చేకూరింది.. కామారెడ్డి జిల్లాలో 57,610 ట్రిప్పులకు లక్షా 10వేల మందికి సేవలు అందాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షా 110 ట్రిప్పులు పూర్తి చేసుకున్నది. వీటి ద్వారా 2లక్షల 8వేల మందికి 102 సేవలు దరిచేరాయి. గతంలో దవాఖానల్లో ప్రసవించిన అనంతరం ఇంటికి వెళ్లాలంటే ప్రత్యేక వాహనానికి రూ.వేలు ఖర్చు అయ్యేవి. ఇప్పుడు ఉచితంగానే అమ్మఒడి పథకంతో మహిళలకు గరిష్ఠ మేలు చేకూరుతున్నది. గర్భిణులకు మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు వివిధ రకాల వైద్య పరీక్షలకు 102 వాహనాల్లో ఉచిత సేవలు అందుతుండడం విశేషం. డెలివరీ అనంతరం శిశువుకు వివిధ దశల్లో టీకాలు ఇప్పించేందుకు 102 వాహనాలను వాడిన వారి సంఖ్య వేలల్లో చేరుతున్నది.
గర్భం దాల్చిన మహిళలు వైద్య పరీక్షల కోసం అమ్మఒడిని సద్వినియోగం చేసుకోవాలంటే 102 నంబర్కు ఫోన్ చేస్తే సరిపోతుంది. తన పేరును ఆశ కార్యకర్త వద్ద నమోదు చేసుకొని 9నెలల వరకు ప్రతి నెలా యాంటినెంటల్ చెకప్(ఏఎంసీ) వైద్య పరీక్షలకు ఇంటి నుంచి దవాఖానకు వెళ్లడానికి 102 సేవలను ఉపయోగించుకోవచ్చు. వైద్య పరీక్షల అనంతరం అదే వాహనంలో దవాఖాన నుంచి ఇంటికి భద్రంగా తీసుకెళ్తారు.
అమ్మఒడి వాహనాల ద్వారా బాలింతలు, గర్భిణులు, శిశువులకు అద్భుతంగా సేవలు అందుతున్నాయి. ఆరోగ్య పరీక్షల నుంచి ప్రసవాల దాకా ఈ వాహనా ల్లో సంబంధిత మహిళలను దవాఖానలకు సకాలం లో చేరవేస్తున్నాం. 102 వాహనాలకు మంచి ఆదరణ లభిస్తున్నది. మారుమూల ప్రాంతాలు, తండాల్లో వా హన సౌకర్యం లేని వారికి ఎంతో ఉపయుక్తంగా ఉం ది. ఫోన్ చేయగానే పరిస్థితిని అనుసరించి ఎలాంటి జాప్యం లేకుండా వాహనాలు అందుబాటులో ఉంటున్నాయి.
– అనిరుధ్, నిజామాబాద్ జిల్లా 108 కో-ఆర్డినేటర్