నిజాంసాగర్, మే 25 : దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే దళితబంధు పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు.
మండలంలోని పలువురు లబ్ధిదారులకు మూడో విడుతగా మంజూరైన వాహనాలను మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజాంసాగర్ మండలంలో మొత్తం 1,349 కుటుంబాలను దళితబంధు పథకానికి అర్హులుగా గుర్తించామని చెప్పారు.
వారిలో 946 కుటుంబాలకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి చేతుల మీదుగా యూనిట్లను అందజేశామని గుర్తుచేశారు. ఈ నెల 19న రెండో విడుతగా 91 కుటుంబాలకు వాహనాలను అందజేశామని తెలిపారు. మూడో విడుతగా ప్రస్తుతం 23 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందజేస్తున్నామని, మిగితా వారికి మంజూరైన జీవాలు, వ్యాపార యూనిట్లను త్వరలోనే పంపిణీ చేస్తామని వివరించారు.
దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారవేత్తలుగా ఎదగాలని జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు కోరారు. ఈ పథకం రాజకీయ లబ్ధి కోసమో.., ఓట్ల కోసమో ప్రవేశపెట్టలేదని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, ఏఎంసీ ఉపాధ్యక్షుడు విఠల్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, సొసైటీ చైర్మన్ వాజిద్అలీ, నాయకులు దేవదాస్, సందీప్, రమేశ్, విఠల్రెడ్డి, వెంకటేశం, తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో పర్బన్న తదితరులు పాల్గొన్నారు.