ఖలీల్వాడి, మే 25 : మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం పర్యటించిన ఆమెకు కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, అడిషన్ కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు డీసీపీ అరవింద్బాబు తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు.
అనంతరం కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ప్రధాన మంత్రి 15 సూత్రాల పథకం అమలు తీరుపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉచిత శిక్షణ కేంద్రాల్లో మైనారిటీ యువతులకు అవకాశం కల్పించాలని, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం పెదపీట వేస్తున్నందున అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మైనారిటీల జనాభా, వారి స్థితిగతులు, ప్రభుత్వ పథకాలను అమలుచేస్తున్న తీరును జాతీయ కమిషన్ సభ్యురాలికి వివరించారు. సమావేశంలో మైనారిటీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నాగోరావు, విజిలెన్స్ అధికారి షేక్ అహ్మద్ జియా, బషీర్, జడ్పీ సీఈవో గోవింద్, డీపీవో జయసుధ, ఆర్డీవో రవి తదితరులు పాల్గొన్నారు.