నందిపేట్, మే 25 : బస్సులో తీర్థయాత్రకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం చోటుచేసుకున్నది. వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వెల్మల్ గ్రామానికి చెందిన సారమ్మ (70) అక్కడికక్కడే మృతిచెందింది. అందులో ఉన్న మరో 37 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
సారమ్మ మృతదేహాన్ని, అలాగే తీర్థయాత్రకు వెళ్లిన భక్తులను జిల్లాకు రప్పించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నందిపేట్ మండలం తల్వేద, వెల్మల్, డొంకేశ్వర్, దత్తాపూర్, నిర్మల్ జిల్లా బాసరకు చెందిన 38 మంది భక్తులు ఈ నెల 20న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నవతా ట్రావెల్స్ ఆధ్వర్యంలో నుంచి ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ యాత్రకు బస్సులో బయలుదేరారు.
24న ఉదయం టీ తాగడానికి బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా బరూన్లో బస్సును టీకొట్టు ముందు నిలపడానికి ప్రయత్నం చేస్తుండగా వెనకాల నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో బస్సు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న వెల్మల్ గ్రామానికి చెందిన సారమ్మ మృతి చెందగా మిగతా యాత్రికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బరూన్లోని ప్రభుత్వ దవాఖానకు, మరి కొందరిని ఔరంగాబాద్లోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. వెల్మల్ గ్రామానికి చెందిన గరిపల్లి లక్ష్మికి చేతు, నిజామాబాద్కు చెందిన సుభద్రకు కాలు విరిగినట్లు తెలిసింది.