కామారెడ్డి, మే 25 : రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి సారించింది. వరిపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో ఆయిల్పామ్ పంటను విస్తృతంగా సాగు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలో రూ.4800కోట్ల వ్యయంతో ఈ పంట విస్తరణకు నడుం బిగించింది. రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, నేలలు అనుకూలంగా ఉండడంతో రైతులకు రాయితీలు ఇచ్చి ఆయిల్ పామ్ సాగుపై శ్రద్ధ కనబరుస్తున్నారు. ఎకరం వరి పంట సాగు చేసే నీటితో 4 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయవచ్చు. వరి పంటతో పోలిస్తే తక్కువ నీరు అవసరం అయినప్పటికీ ఆయిల్పామ్ సాగుకు ప్రతిరోజూ తడి అందించాలి. ఇప్పటి వరకు సాగు చేస్తున్నన త్రిభుజాకార పద్ధతికి బదులుగా ప్రస్తుతం చతురస్రాకార పద్ధతిలో ఆయిల్పామ్ సాగుకు ఉద్యానవనశాఖ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 750 మంది రైతులకు భద్రాది కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వం స్టడీ టూర్లు నిర్వహించి అవగాహన కల్పించింది. కామారెడ్డి జిల్లాకు సరఫరా చేసేందుకు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని రాంపూర్లో విశ్వ ఆగ్రోటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ మొక్కలను పెంచుతున్నారు. 2022-23 సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలో 1,713 ఎకరాల్లో పంట సాగుకు సమాయత్తం చేస్తున్నారు. ఇందుకోసం 745 మంది రైతులను గుర్తించారు.
విశ్వ అగ్రోటెక్ నర్సరీలో లక్షా 10 వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లి గ్రామంలో ఇప్పటికే ఆయిల్పామ్ మొక్కలను మూడేండ్ల క్రితం నుంచి పెంచుతున్నారు. పంట పండిన అనంతరం ప్రాసెసింగ్ యూనిట్లకు, టీఐడీఈఏ, టీఎస్ఎఫ్జెడ్ నిబంధనల ప్రకారం ప్రోత్సహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్తో పాటు 14 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సొంత ఖర్చులతో నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రతి కంపెనీకి సాగు చేసే ప్రాంతాలను జోన్లుగా విభజించి వారికి అప్పగించారు.
వచ్చే ఏడాది లోగా రాష్ట్రంలో 8లక్షల ఎకరాల్లో సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరి కొనుగోలు విషయంలో కేంద్రం అవలంబిస్తున్న వైఖరితో వాణిజ్య పంటలను సాగు చేయించే ప్రయత్నం చేస్తున్నది. ఆయిల్పామ్ సాగు చేసే రైతుకు ఎకరాకు రూ.11,600, ఎరువులు, అంతర పంటల కోసం సంవత్సరానికి ఎకరాకు రూ.4,200 చొప్పున నాలుగేండ్ల వరకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్నది.
ఎకరాకు రూ.20,317 చొప్పున బిందుసేద్యానికి రాయితీ అందిస్తున్నారు. ఒక్కో రైతుకు 12.5 ఎకరాల వరకు సబ్సిడీ అందిస్తున్నారు. ఎకరం భూమిలో 50 పామాయిల్ మొక్కలను సాగు చేస్తే నాలుగేండ్ల తర్వాత దిగుబడి ప్రారంభం అవుతుంది. ఎకరానికి రైతుకు నికరంగా ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం లభించనున్నది. ఈ పంట సాగు చేసే రైతులకు రైతుబంధుతో పాటు అదనంగా మరో రూ.4వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనున్నది.
రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు చేయడంతో పాటు అభివృద్ధి చేసే విషయమై ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్తో పాటు మరో 7 ప్రైవేట్ కంపెనీలకు ఆయిల్పామ్ సాగు విషయమై నోటిఫై చేస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 4లక్షల 61వేల 300 ఎకరాల భూముల్లో సదరు కంపెనీలు సర్వే చేసి నోటిఫై చేశారు.
ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్జీవీ మలేషియా గ్రూప్)కు నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, నాగర్కర్నూల్, వనపర్తి, మహబుబ్ నగర్ జిల్లాలో 1,75,710 ఎకరాలను కేటాయించారు. విశ్వ ఆగ్రోటెక్కు కామారెడ్డి జిల్లాలో 65,052 ఎకరాలు కేటాయించారు. నిజామాబాద్ జిల్లాలో 54,878 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 65,052 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి.
పంటల దిగుబడులు వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. ఒక పంట కాలంలో ఎకరంలో సుమారు 10 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పంట సాగు కింద సబ్సిడీలో డ్రిప్, స్ప్రింక్లర్లను ప్రభుత్వం అందించనున్నది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను పెద్ద మెత్తంలో అయిల్పామ్ మొక్కలను అందుబాటులోకి తెస్తున్నారు.
ఈ పంట సాగుచేసే రైతులకు మూడేండ్ల పాటు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్న రైతులకు గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, సస్యరక్షణ చర్యలు వంటివి తీసుకునేలా అవకాశం కల్పించింది. బిందుసేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ, జనరల్ రైతులకు 5 ఎకరాలలోపు 90 శాతం, 5ఎకరాల పైన ఉంటే 80 శాతం సబ్సిడీపై పరికరాలు అందించే విధంగా చర్యలు చేపట్టగా, ఇందుకు జీఎస్టీ ఆదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ఇప్పటికే స్టడీ టూర్ నిర్వహించి అవగాహన కల్పించాం. డిచ్పల్లి మండలం రాంపూర్ వద్ద విశ్వ ఆగ్రోటెక్ నర్సరీలో లక్ష 10వేల మొక్కలను పెంచుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో మొక్కలను రైతులకు అందిస్తాం. 2,3 ఏండ్లలో పంటను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాం.
-డి.సంజీవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి, కామారెడ్డి