నిజామాబాద్ క్రైం, ఆగస్టు 29 : పండుగల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరుగకుండా ప్రజలందరూ శాంతియుతంగా నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి సూచించారు. నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, చిన్నపాటి నేరాలు సైతం జరగకుండా దృష్టి సారించాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన నేరాలపై త్వరితగతిన విచారణ జరిపి పెండింగ్ కేసుల శాతాన్ని తగ్గించాలని సూచించారు.
సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పో లీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. నాన్ బెయిలెబుల్ కేసులపై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో బృందాలను ఏర్పాటు చేసి త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు. షీ టీమ్స్ మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించారు. మట్కా, గంజాయి, గ్యాంబ్లింగ్లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం(సీసీటీఎన్ఎస్)లో ప్రతి పోలీస్ స్టేషన్లోని ఎఫ్ఐఆర్లు, కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పడు పొందుపర్చాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతో పాటు బీట్లు ఏర్పాటు చేసి రాత్రి సమయంలో వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రధానంగా దొంగతనాల నివారణకు కృషి చేయాలని సూచించారు.
లాడ్జీల్లో తరచూ తనిఖీలు చేపట్టాలన్నారు. పెండింగ్ చలానాలు కట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులు మళ్లీ నేరాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. డయల్ 100 కు ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని డీజీపీ పేర్కొన్నారు.సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, అదనపు డీసీపీలు ఉషా విశ్వనాథ్,ఎం.నరేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి. శ్రీహరి,ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, వర్టికల్ ఆఫీసర్స్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.