నిజామాబాద్ క్రైం/ విద్యానగర్, ఆగస్టు 27: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేడు (ఆదివారం) కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష (ప్రిలిమ్స్) నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 97 పరీక్షా కేంద్రాలను (నిజామాబాద్ జిల్లాలో 68, కామారెడ్డిలో 29) ఏర్పాటుచేశారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 22,167 మంది, కామారెడ్డి జిల్లాలో 11,042 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. నిమిషం నిబంధన అమలు అమలుచేయనున్నారు. హాల్టికెట్ తీసుకోని వారు www.tslprb. in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు గంట ముందే (9 గంటలకు) కేంద్రంలోకి అనుమతిస్తారని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తాగు నీరు, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, బస్టాండ్ నుంచి పరీక్షా కేంద్రాల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు. పరీక్షా కేంద్రం నుంచి 100 మీటర్ల లోపు జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసి ఉంచాలని నిజామాబాద్ సీపీ నాగరాజు ఆదేశించారు.
కానిస్టేబుల్ ప్రిలిమిరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ 94906 18000, 94913 98540 నంబర్లను సంప్రదించాలని సూచించారు.