నవీపేట, ఆగస్ట్టు 14 : తెలంగాణ అభివృద్ధిని ప్రధాని మోదీ జీర్ణించుకోలేపోతున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువులతోపాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి, జీఎస్టీ వసూలు చేస్తూ సామాన్యప్రజానీకంతోపాటు రైతులను ఇబ్బందుకు గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
నవీపేట మండలంలోని రాంపూర్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్.రాంకిషన్రావుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని పగటి కలలుకంటున్న బీజేపీ.. మతవిద్వేషాలను సృష్టిస్తున్నదని ఆరోపించారు.
మతం పేరుతో ఓట్లను దండుకోవాలని కుట్ర పన్నుతున్నదన్నారు. యువకులు అప్రమత్తంగా ఉంటూ, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ర్టాల నుంచి రా రైస్ సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణపై పక్షపాత వైఖరిని లవలంబిస్తున్నదని విమర్శించారు.
నిజాం నావాబు కాలంలో ఫత్తేనగర్ లో మాజీ సైనికులకు ఇచ్చిన భూములకు పట్టాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే షకీల్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీపై గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్.రాంకిషన్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభత్వం ఇప్పిటికే 36 లక్షల ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. త్వరలోనే మరో 10 లక్షల పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారన్నారు.
రాంపూర్లో గోసంగి సంఘ భవన నిర్మాణానికి సీడీపీ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే షకీల్ ప్రకటించారు. అంతకు ముందు భవన నిర్మాణ పనులకు సంఘ సభ్యులతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. అలాగే ఎల్కే ఫారం పశువుల దవాఖాన, రాంపూర్ గ్రామానికి 40 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. నవీపేట నుంచి తాడ్బిలోలి వరకు డబుల్ బీటీ రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 57 ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు పంపిణీ ప్రారంభమవుతుందని ప్రకటించారు.
రాంపూర్ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాంపూర్, ఎల్కే ఫారం గ్రామాల సరిహద్దులో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం, ఎల్కే ఫారంలో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనం, మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు. రాంపూర్లో రూ.14 లక్షల వ్యయంతో చేపట్టిన జీపీ భవనం, రూ.10 లక్షలతో చేపట్టిన వ్యవసాయం గిడ్డంగి భవనాలను ప్రారంభించారు.
అంతకు ఎమ్మెల్యే షకీల్కు గ్రామస్తులు, యువకులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, జడ్పీటీసీ నీరడి సవిత, సర్పంచ్ దోంత రుతు కల్పన, ప్రవీణ్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్రావు, ఎంపీటీసీ గైని లావణ్యామోహన్, నవీపేట సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు న్యాలకంటి అబ్బన్న, దోంత ప్రవీణ్కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, వైస్ ఎంపీపీ ఇందూర్ హరీశ్, బుచ్చన్న, మాజీ సర్పంచ్ అల్లం రమేశ్, నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, రజాక్, మండల యువజన సంఘం అధ్యక్షుడు మంత్రి సాయికుమార్గౌడ్, కరిపె మల్లేశ్, సాయిలు, మహిళా సంఘాల సభ్యులు, మోహన్, గోసంగి సంఘం ప్రతినిధులు, టీఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.