ఆర్మూర్, ఆగస్టు 14 : తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని దక్షిణ భారత రైతుసంఘాల ఫెడరేషన్ అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అన్నారు. వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో తమిళనాడులోని కాంచీపురంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధర, దళారీ వ్యవస్థ లేని కొనుగోళ్లు తదితర అంశాలపై చర్చించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ మంత్రి అన్బరసన్, పౌరసరఫరాల శాఖ మంత్రి సక్కారపాణి పాల్గొన్నారు. గౌరవ అతిథిగా కోటపాటి మాట్లాడారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి కల్పిస్తున్న సౌకర్యాలు, రైతు సంక్షేమ కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. సాగునీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటలపాటు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కనీస మద్దతు ధరతో పూర్తి పంటల కొనుగోలు తదితర అంశాల గురించి తెలిపారు.
సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను దేశమంతా అమలుచేస్తే రైతు రాజు అవుతాడని అభిప్రాయపడ్డారు. సదస్సులో రైతునాయకులు పీకే దైవశిగా మణి, ఏకే బాబు, స్థానిక శాసనసభ్యుడు కే సుందర్, సీవీ ఎంపీ ఎల్ హర్సన్, వ్యాపార సంఘాల నాయకుడు సౌందర రాజన్, రాష్ట్ర వ్యాపార సంఘాల అధ్యక్షుడు విశ్వనాథం, రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.