ఊరూవాడ మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకాలు సగర్వంగా ఎగురుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. శనివారం రెండు జిల్లాల్లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీల్లో ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలతో ర్యాలీలో భాగస్వాములై దేశభక్తిని చాటారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఫ్రీడమ్ ర్యాలీలను ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీ అంబరమంటింది. చిన్నాపెద్ద భేదం లేకుండా జాతీయ జెండాను పట్టుకొని ఊరూవాడా ర్యాలీలు నిర్వహించారు. గల్లీ నుంచి జిల్లా కేంద్రం వరకు త్రివర్ణ శోభితమైంది. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ తదితర పట్టణాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. భారీస్థాయి జెండాలను ప్రదర్శించిన అనంతరం కూడళ్ల వద్ద జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.