నిజామాబాద్ లీగల్, ఆగస్టు 13: జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు చట్ట సంబంధిత విషయ పరిజ్ఞానాన్ని అందజేస్తున్నామని అన్నారు.
సివిల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులను లోక్ అదాలత్లలో పరిష్కరించి అప్పీలుకు వీలులేని అవార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. లైంగిక దాడులకు గురైన బాలలు, హత్యకేసుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి న్యాయసేవాధికార సంస్థ పరిహారాన్ని అందజేస్తూ సామాజిక బాధ్యతను నెరవేర్చుకుంటున్నదని అన్నారు. అదనపు జిల్లా జడ్జి షౌకత్ జహాన్ సిద్ధిఖీ, న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్, బార్ అధ్యక్షుడు ఎర్రం గణపతితో కలిసి సివిల్, క్రిమినల్ కేసులను రాజీపద్ధతిలో పరిష్కరించారు.
జాతీయ లోక్అదాలత్లో మొత్తం 2,344 కేసులు కక్షిదారుల అభిమతం మేరకు పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో పది నష్టపరిహార దావాలకు గాను సుమారు రూ. 32లక్షలు అవార్డులు జారీ చేశామని వివరించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, సౌందర్య, అజయ్కుమార్ జాదవ్, భవ్య, గిరిజ, న్యాయవాదులు రాజ్కుమార్ సుబేదార్, మాణిక్ రాజు, ఆశనారాయణ, జగన్మోహన్గౌడ్, పడిగెల వెంకటేశ్వర్, బాలరాజు నాయక్, సింధూకర్, కోర్టు సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.