డిచ్పల్లి, ఆగస్టు 13: ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్పైనే దృష్టి నిలపాలని, కష్టపడి చదివితే కొలువు మీ సొంతం అవుతుందని సీబీఎస్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత సూచించారు. మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్ హాల్లో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో శనివారం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇష్టపడి ప్రిపేర్ అయితే మంచి ఫలితాలు సాధించగలుగుతామన్నారు. పరీక్షకు 15 రోజులే సమయం ఉన్నందున ప్రతి నిమిషం చదువుకే కేటాయిస్తే లక్ష్యం చేరవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని బాలలత అన్నారు.
ఈనెల 28న పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఉన్నందున యువత కష్టపడి చదవాలని ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ సూచించారు. డిచ్పల్లి ఏడో పోలీస్ బెటాలియన్లో రెండు నెలలుగా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఇప్పిస్తున్నామని, 1400 మందికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా 326 మంది ఉత్తీర్ణత సాధించారని వారు బెటాలియన్లో శిక్షణ తీసుకుంటున్నారని అన్నారు. అనంతరం బాలలతను సత్కరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ నీరడి దినేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ ఇందిరా లక్ష్మీనర్సయ్య, ఇందల్వాయి ఎంపీపీ రమేశ్నాయక్, టీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.