స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పరితపించిన యోధులెందరికో నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతం నిలయంగా మారింది. 1940 నుంచి 1948 సెప్టెంబర్ వరకు.. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో కలిసేవరకు ఎందరెందరో స్వాతంత్య్ర సమరయోధులు తమ సర్వస్వం అర్పించి త్యాగశీలురుగా నిలిచారు. భారత స్వాతంత్య్రం కోసం జరిగిన ఉద్యమాల్లో ముందువరుసలో నిలబడ్డారు.
-బోధన్, ఆగస్టు 10
స్వాతంత్య్రం కోసం పోరాడినవారిలో బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలకు శాసనసభ్యుడిగా ప్రాతినిథ్యం వహించిన ముప్పలనేని శ్రీనివాస్రావు ప్రముఖుడు. దివంగత శ్రీనివాస్రావు నాటి నిజాం రాక్షస పాలనను ఎదిరించి జైలుశిక్షను అనుభవించారు. ఆంధ్రా ప్రాంతంలోని గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్రావు అక్కడ విద్యాభ్యాసం పూర్తిచేసుకొని 1943లో బోధన్ మండలం జాడిజమాల్పూర్కు వలస వచ్చారు.
ఇక్కడికి రాగానే బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం రజాకార్ల ఆకృత్యాలను అరికట్టకపోవడం తదితర పరిణామాలు ఆయనలో సరికొత్త ఆలోచనలను రేపింది. కొత్త ప్రాంతమైనప్పటికీ, మొదట రజాకార్ల ఆకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాడడం మొదలుపెట్టారు. మరోపక్క దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాలని జనాలను చైతన్యవంతం చేశారు.
చివరికి శ్రీనివాస్రావును మహారాష్ట్రంలోని పూర్ణ్ణ రైల్వే జంక్షన్లో అక్కడి రైల్వే పోలీసులు అరెస్టు చేసి ఔరంగాబాద్ సెంట్రల్ జైల్లో బంధించారు. కాంగ్రెస్లో చేరిన ఆయన దేశ స్వాతంత్య్రం అనంతరం బోధన్ మున్సిపాలిటీకి 1953లో చైర్మన్గా ఎన్నికయ్యారు. 1957 నుంచి 1962 వరకు బోధన్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అనంతరం 1967 నుంచి 1983 వరకు మూడుసార్లు బాన్సువాడ శాసనసభ్యుడిగా పనిచేశారు. 1991 మార్చి 21న శ్రీనివాస్రావు కన్నుమూశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో జరిగిన ఉద్యమంలో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్రావు కీలకపాత్ర పోషించారు. మర్రి చెన్నారెడ్డితోపాటు శ్రీనివాస్రావును అరెస్ట్ చేసిన నాటి ప్రభుత్వం ఆయన్ని కొద్దిరోజులపాటు జైలులో పెట్టింది.
జాతీయ జెండాను చేతపట్టడంతోపాటు నాటి రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించిన యోధుడిగా రేణుకాదాస్రావుకు పేరున్నది. మహారాష్ట్రకు చెందిన రేణుకాదాస్రావు తన వివాహం అనంతరం బోధన్ డివిజన్లోని ఎడపల్లి స్థిరపడ్డారు. అత్తగారింట్లో ఉంటూ స్వాతంత్య్ర పోరాటంలో తన వంతు పాత్రను నిర్వర్తించారు. ముఖ్యంగా రజాకార్ల దౌర్జనాలకు వ్యతిరేకంగా పోరాడారు. దీంతో రేణుకాదాస్ రావు కొంతకాలంపాటు జైలుశిక్షను అనుభవించాల్సి వచ్చింది. స్వాతంత్య్రం అనంతరం ఆయన రాజకీయ నాయకుడిగా ప్రజల్లో గుర్తింపును పొందారు. అనేక పదవులను అనుభవించారు. ఎడపల్లి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆంధ్రా నుంచి వ్యవసాయం కోసం ఆచన్పల్లి గ్రామానికి వచ్చి స్థిరపడిన పాలడుగుల శ్రీరామమూర్తి బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమికొట్టాలని తపించేవారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూకా నుంచి ఆచన్పల్లికి 1944లో వలస వచ్చారు. ఆంధ్రాలో ఉండగా, బ్రిటీష్వారికి వ్యతిరేకంగా అక్కడి స్థానికులతో కలిసి పోరాడారు. దీంతో శ్రీరామమూర్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.
జైలుశిక్ష అనంతరం కూడా ఆయన బ్రిటీష్వాళ్లకు వ్యతిరేకంగా పోరాడడం మానలేదు. ఈ క్రమంలో జీవనోపాధి కోసం ఆచన్పల్లికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పటికీ, ఆయనలోని స్వేచ్ఛాపిపాస చావలేదు. ఇక్కడి రజాకార్ల దురాగతాలను చూసి చలించిపోయారు.
రజాకార్లను తరిమికొట్టాలని పోరాడడం ప్రారంభించారు. ఇక్కడ కూడా ఆయన్ని హైదరాబాద్ సంస్థానం పోలీసులు బంధించి జైలుకు తరలించారు. కొన్ని నెలలపాటు శ్రీరామమూర్తి జైలుశిక్షను అనుభవించారు. దేశానికి స్వాతంత్ర్ంయ రావడంతో ఆచన్పల్లిలో జాతీయజెండాను ఎగురవేసి తన దేశభక్తిని చాటుకున్నారు. 1975 జనవరి 16న ఆయన
కన్నుమూశారు.