బాన్సువాడ/బాన్సువాడ రూరల్, ఆగస్టు 10 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా 11 లక్షల మందికి పెన్షన్లు మంజూరు కానున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమాజంలో 80 శాతం మంది పేదలే ఉన్నారని, అ కుటుంబాలన్నీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపైనే ఆధారపడి బతుకుతున్నాయని అన్నారు. ప్రజలకు ఉచిత పథకాలను అందించొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయ డం బాధాకరమన్నారు.
పేదలకు అందించే పెన్షన్లు, వివిధ సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 50వేల కోట్లు కేటాయిస్తున్నదని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన వారికి పింఛన్లు అందించేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని స్వగృహంలో బుధవారం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఘనంగా నిర్వహించాలన్నారు. దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను భావి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
అనంతరం పలు మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బాన్సువాడ పట్టణంగా మారిన సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులకు మున్సిపల్ అధికారులుగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో పలువురు ఉద్యోగులు స్పీకర్ను కలిసి సన్మానించారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ఎంపీపీలు, ఏఎంసీ, సొసైటీల చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ మండలం జక్కల్దాని తండాలో ఏర్పాటుచేసిన వనమహోత్సవం, జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి తండా వాసులకు జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాలను ఎగురువేయాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 1.20 కోట్ల జాతీయ జెండాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నదని తెలిపారు. మనది అభివృద్ధి చెందుతున్న దేశమని, సంపదను సృష్టించి పేదలకు అందిచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్యానికి ఉందన్నారు.
పేదలపై భారం మోపేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన విద్యుత్ సవరణ చట్టం అనాలోచిత నిర్ణయంగా స్పీకర్ అభిప్రాయపడ్డారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నదని, ప్రైవేటీకరణతో పేదలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలిపారు.
రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గుర్తుచేశారు. వన మహోత్సవంలో ఎంపీపీ దొడ్ల నీరజ, ఏఎంసీ చైర్మన్ బాలకృష్ణ, సర్పంచ్ సంగ్యానాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాబోయే శాసనసభ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని స్పీకర్ తెలిపారు. తన కుమారుల్లో ఒకరు పోటీలో ఉంటారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సీఏం కేసీఆర్ సైతం తననే పోటీలో ఉండాలని సూచించారని తెలిపారు. అందరూ కష్టపడి ప్రజలకు సేవలందించాలని సూచించారు.