నిజామాబాద్ క్రైం, ఆగస్టు10: తమ మధ్య అన్నా చెల్లెళ్ల సంబంధం మాత్రమే ఉన్నదని, ఎలాంటి తప్పు చేయకపోయినా ప్రేమికులమంటూ లేనిపోని పుకార్లు పుట్టించి తమకు సంబంధం అంటగట్టారని మనస్తాపం చెందిన యువకుడు, బాలిక ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో యువకుడు మృత్యువాత పడగా.. బాలికల చికిత్స పొందుతున్నది.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులతోపాటు వారి వద్ద లభించిన లేఖ ఆధారంగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన పుట్ట వినయ్ కుమార్(22), మరో గ్రామానికి చెందిన 17 ఏండ్ల బాలిక కొంత కాలంగా స్నేహంగా ఉంటున్నారు. వినయ్ నిజామాబాద్లో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. బాలిక ఓ కళాశాలలో చదువుతున్నది. వీరి మధ్య ఏర్పడిన పరిచయంతో వారు సన్నిహితంగా ఉండే వారని స్నేహితులు తెలిపారు.
అయితే వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని కుటుంబ సభ్యులు, ఇతరులు తప్పు పట్టడంతో పాటు చెడుగా ప్రచారం చేసినట్లు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన వినయ్, బాలిక కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. ఈ నెల 8వ తేదీన ఇద్దరూ పురుగుల మందు కొనుగోలు చేసుకొని నిజామాబాద్ నగరంలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల పరిసర ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ కలిసి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు.
అన్నాచెల్లిగా ఉన్న తమకు సమాజంలో అవమానం జరిగిందని, అందుకోసం ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆ బాలిక తన అక్కకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానికంగా ఉండే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. డయల్ 100 కంట్రోల్ రూమ్ నుంచి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్లు సంబంధిత త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, బాలిక బంధువులు వారి కోసం వెతికారు.
బాలిక కుటుంబ సభ్యులు వారిని గుర్తించారు. త్రీ టౌన్ ఎస్సై-2 భాస్కరాచారి బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. అమ్మాయి, అబ్బాయి దొరికారని, వారు స్పృహలోనే ఉన్నారని త్రీ టౌన్ ఎస్సై-2కి బాలిక కుటుంబ సభ్యులు తెలిపి వారిని అదే రోజు రాత్రి చికిత్స నిమిత్త ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ కుమార్ బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు. త్రీ టౌన్ ఎస్సై-2 దవాఖానకు వెళ్లి యువకుడు, బాలిక కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి పుట్ట గంగాధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. బాలిక ప్రస్తుతం దవాఖానలో చికిత్సపొందుతున్నట్లు తెలిపారు.