విద్యానగర్, ఆగస్టు 10: రక్షాబంధన్ వేళ రాఖీలు కట్టేందుకు అన్నదమ్ముల ఇంటికి వెళ్లని ఆడబిడ్డల కోసం ఆర్టీసీ కార్గో సేవలు అందిస్తున్నది. గతంలోనూ కార్గో ద్వారా మేడారం జాతరలో వనదేవతలు సమ్మక్క, సారక్క తల్లులకు సమర్పించిన బెల్లం (బంగారం), శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం తలంబ్రాలు, వేసవిలో మామిడి పండ్లను ప్రజలకు పంపించే సేవలు అందించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆడబిడ్డల కోసం కార్గో సువర్ణావకావాన్ని కల్పించింది.
ఆర్టీసీ అభివృద్ధికి చేయూతనిస్తున్న కార్డో సేవలు ఇప్పుడు అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ సందర్భంగా సేవలు అందిస్తోంది. రాఖీలను పంపించడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నది. ఈనెల 12వ తేదీ రాఖీ పౌర్ణమిని దృష్టిలో ఉంచుకొని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 5 కౌంటర్లను ఏర్పాటు చేశారు. అతి తక్కువ చార్జీలతో రాఖీలను పంపించే ఏర్పాట్లు చేశారు.
రాఖీలను పంపించేందుకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం, ఎల్లారెడ్డి, దోమకొండలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బెంగళూర్ తదితర ప్రాంతాలకు 24 గంటల్లో రాఖీ పంపించేలా ఏర్పాట్లు చేశారు. రాఖీ పార్శిల్కు రూ.45, స్వీట్ డబ్బాకు రూ.70 చార్జీ వసూలు చేస్తున్నారు. ప్రతి కౌంటర్ వద్ద ఒక ఎగ్జిక్యూటివ్ను నియమించి పార్శిళ్లను పంపిస్తున్నారు. ఈ సేవలు ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగనున్నాయి.
రాఖీ పండగ సందర్భంగా నేరుగా సోదరుల వద్దకు వెళ్లలేని మహిళలు, యువతులు తెలంగాణ ఆర్టీసీ కార్గో ద్వారా రాఖీలు, స్వీట్ల డబ్బాలను పంపించుకోవచ్చు. అతి తక్కువ చార్జీతో పంపించే అవకాశాన్ని కార్గో కల్పించింది. ఇతర రాష్ర్టాలకు కూడా సేవలు అందిస్తున్నాం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– మల్లేశం, డిపో మేనేజర్, కామారెడ్డి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 5 కౌంటర్లను ఏర్పాటు చేశాం. 24 గంటల్లోనే రాఖీలను గమ్యస్థానానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం వరకు ఈ సేవలు కొనసాగుతాయి.
– రాజు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కామారెడ్డి