ముప్కాల్, ఆగస్టు 10 : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రం వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం, నిద్ర మత్తులో డ్రైవింగ్ కారణంగా జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరితోపాటు మరో ముగ్గురు గాయపడ్డారు. మృతులు హైదరాబాద్, మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన వారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లోని టోలీచౌకీ అరుణ కాలనీకి చెందిన మిన్హాజ్ బేగం, అహిల్ అహ్మద్, ఫిజ్లా, సయ్యద్ సమీ, సయ్యద్ సాదియా, సయ్యద్ ఆదిల్, సయ్యద్ ఉమేర్ హైదరాబాద్ నుంచి మహారాష్టలోని వార్ధాకు కారులో మిన్హాజ్ బేగం పుట్టింటికి బయల్దేరారు. ముప్కాల్ సమీపంలో ఉదయం సుమారు 6 గంటల సమయంలో జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న వీరి కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ అవతలి పక్క రోడ్డులో పడింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న హైదరాబాద్కు చెందిన మిన్హాజ్ బేగం (39), వరుసకు తమ్ముడైన వార్దాకు చెందిన సయ్యద్ సమీ (32), మిన్హాజ్ బేగం కుమారుడు అహిల్ అహ్మద్(6), కూతురు ఫిజ్లా (2 నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మిన్హాజ్ బేగం మరో కూతురు సయ్యద్ సాదియా, కుమారులు సయ్యద్ ఆదిల్, సయ్యద్ ఉమేర్కు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో సయ్యద్ ఆదిల్ పరిస్థితి విషమంగా ఉండగా మరో బాలుడు ఉమేర్ షాక్లో ఉన్నాడు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లితో పాటు ఆమె ఇద్దరు పిల్లలు, తమ్ముడు మృతి చెందడంతో సంఘటనా స్థలి హృదయవిదారకంగా మారింది. రెండు నెలల చిన్నారి, ఆరేండ్ల బాలుడు మృత్యు వాత పడడం కంట తడి పెట్టించింది. సంఘటనాస్థలికి పోలీసులు చేరుకొని గాయపడిన వారిని ఆర్మూర్, నిజామాబాద్ దవాఖానలకు తరలించారు. మృతదేహాలను బాల్కొండలో మార్చురీకి తరలించారు.అతివేగం వల్లే ఈప్రమాదం జరిగిందని ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్రెడ్డి, ఎస్సై ప్రభాకర్రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.