ఇందూరు, ఆగస్టు 4: పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటుతున్న ప్రతి మొక్కకూ తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలని అటవీశాఖ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్ఎం.డోబ్రియల్ సూచించారు. గురువారం ఆయన రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యాలయం అరణ్య భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల అటవీశాఖ అధికారులు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్డీవోలతో హరితహారం ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా హరితహారం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో సాధించిన ప్రగతి, చేపట్టాల్సిన కార్యక్రమాలపై డీఎఫ్వో సునీల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్ఎం డోబ్రియల్ మాట్లాడుతూ అనేక జిల్లాల్లో నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేయడం లేదన్నారు. ప్రతి జిల్లాలో జియో ట్యాగింగ్ 90 శాతానికి తగ్గకుండా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇప్పటికే 50 శాతానికిపైగా మొక్కల పంపిణీ పూర్తయినందున వాటిని నిర్దేశిత ప్రదేశాల్లో నాటారా లేదా అన్నది పరిశీలన చేయాలన్నారు. నాణ్యతతో కూడిన, ఎక్కువ ఎత్తు కలిగిన మొక్కలను నాటాలని, అప్పుడే ఆశించిన స్థాయిలో పచ్చదనం పెంపొందుతుందని అన్నారు. నాటిన మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హరితహారంలో వెనుకబడిన జిల్లాలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సలో డీఆర్డీవో చందర్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.