బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం, బలగమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ వారికి అండగా ఉంటానన్నారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ప్రధాని మోదీ తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపదను దోచి పెడుతున్నాడని, దీనిపై కేసీఆర్ ప్రశ్నించినందుకే కవితపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. బాల్కొండలో శువ్రారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి సతీసమేతంగా హాజరయ్యారు. కార్యకర్తలను పేరుపేరునా ఆప్యాయంగా పలుకరించిన వేముల.. వారికి స్వయంగా వడ్డించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో శతాధిక వృద్ధుడు దేవన్న చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
బాల్కొండ, మార్చి 24:కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి, తనకు బలం, బలగమని.. ఊపిరి ఉన్నంత వరకు వారికి అండగా ఉంటానని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్టీ అంటే రాజకీయం, అధికారమే కాదని, కార్యకర్తల బాగోగులు చూడడం కూడా ఎంతో ముఖ్యమన్నారు. అందుకే, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి కార్యకర్తల కష్టసుఖాల్లో భాగమవుతున్నట్లు చెప్పారు. తనకు ఓపిక ఉన్నంత వరకు కా దు.. ఊపిరి ఉన్నంత వరకూ ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్తో కలిసి మంత్రి ప్రశాంత్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కుటుంబ సమేతంగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలను చూసి మంత్రి వేముల పులకరించి పోయా రు. అంతకు ముందు జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అరాచకాలను కార్యకర్తలకు వివరించారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శనం చేశారు.
సీఎంకు ఆత్మీయుడు మంత్రి వేముల..
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు ఆత్మీయుడని, ఆ సాన్నిహిత్యంతోనే మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారని జిల్లా ఇన్చార్జి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ పంపిన సందేశాన్ని ఆయన ఆత్మీయ సమ్మేళనంలో చదివి వినిపించారు. రాష్ట్ర అభివృద్ధిలో, బీఆర్ఎస్ పార్టీ ఘనమైన ప్రస్థానంలో కేసీఆర్ శ్రమ ఉందన్నారు. పల్లెప్రగతి ప్రారంభమైనప్పుడు ఇవన్నీ సాధ్యమేనా అని సందేహపడ్డ ఎందరో నేడు పల్లె ప్రగతిలో అవార్డులు అందుకుంటున్నారని గుర్తు చేశారు. మంత్రిగా బాధ్యతల నిర్వహణలో, సీఎం ఆదేశాలతో ముఖ్యమైన బాధ్యతల నిర్వహణలో ఎంతో కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్రెడ్డి, ఎంపీపీ లావణ్యాలింగాగౌడ్, జడ్పీటీసీ లావణ్యావెంకటేశ్, సర్పంచ్ బూస సునీత నరహరి, ఆయా గ్రామాల బీఆర్ఎస్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నర్సింహనాయుడు పాల్గొన్నారు.
వేడుకలా ఆత్మీయ సమ్మేళనం..
కమ్మర్పల్లి, మార్చి 24: బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగలా సాగింది. నియోజకవర్గంలో నిర్వహించిన సమ్మేళనానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సతీమణి నీరజారెడ్డితో కలిసి హాజరవ్వడం కార్యకర్తలకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అటు కార్యకర్తలు సైతం భార్యాపిల్లలతో పాల్గొనడంతో కార్యక్రమం మొత్తం ఓ పెద్ద కుటుంబంలో జరిగిన వేడుకలా సాగింది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దంపతులు సతీసమేతంగా వచ్చిన కార్యకర్తలు, నాయకులను పేరుపేరునా పలుకరిస్తూ, యోగక్షేమాలు మాట్లాడుతూ వారితో కలిసి ఫొటోలు దిగడంతో కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం కనిపించింది. అన్నివేళల్లో, అన్ని విధాలా కార్యకర్తలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా ఉంటున్న తీరును కార్యకర్తలు గుర్తుచేశారు. మంత్రి సతీమణి నీరజారెడ్డి సభలోని మహిళలతో మాట్లాడుతూ, వారితోనే కలిసి కూర్చోవడం ప్రత్యేక సంతోషాన్ని నింపింది.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందని మంత్రి వేముల అన్నారు. ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారన్నారు. పేదింటి బిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి మానవీయ పథకాలు దేశంలో అమలు చేస్తున్నది ఒక్క కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. లక్ష కోట్ల వ్యయంతో కరెంటు బాగు చేసి, 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఘనత కేసీఆర్ది అన్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అందించడం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. నాలుగున్నర లక్షల కోట్లతో రైతులకు మేలు చేసే పథకాలు, 78 వేల కోట్లతో పింఛన్లు, 10 వేల కోట్లతో కల్యాణలక్ష్మి, 15 వేల కోట్లతో అమ్మ ఒడి పథకాలను అందించిన మానవీయ పాలన ఆయనది అని ప్రశంసించారు.
అవినీతిని ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారు..
ప్రధాని నరేంద్ర మోదీ దేశ సంపదను తన గుజరాత్ కార్పొరేట్ మిత్రులకు దోచి పెడుతున్నాడని మంత్రి మండిపడ్డారు. కేంద్ర అవినీతి పై కేసీఆర్ నిలదీస్తున్నందునే ఆయన కూతురు కవితను కేసుల పేరిట కేంద్రం వేధిస్తోందని విమర్శించారు. తన దోస్తులకు చెందిన రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేయడమే కాదు, అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ, ఎస్బీఐ డబ్బులను పెట్టుబడి పెట్టి ప్రజాధనాన్ని మోదీ కార్పొరేట్లకు దోచి పెడుతున్నాడన్నారు. ఎన్నో పథకాలు, పింఛన్ల ద్వారా కేసీఆర్ పేదల ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉంటే, మోదీ మాత్రం ధరలు పెంచుతూ పేదల డబ్బులు తీసుకెళ్తున్నాడని విమర్శించారు. లక్షల కోట్ల అవినీతిపై విచారణకు సిద్ధపడని కేంద్రం.. 100 కోట్ల అవినీతి అంటూ.. అందులో ఒక్క రూపాయి ఆధారం లేకున్నా కవిత పై కేసులు, విచారణ అంటూ వేధించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు.
కండ్లముందే అభివృద్ధి
నియోజకవర్గంలో రూ.100 కోట్లతో సీసీ రోడ్ల అభివృద్ధి జరిగితే, అందులో 15 కోట్లతో బాల్కొండ మండలంలో రోడ్లు వేశామన్నారు. 60 కొత్త జీపీ భవనాలు తెచ్చుకున్నామని గుర్తు చేశారు. ఇంటింటికీ నల్లాతో నీటి తిప్పలు తీరాయన్నారు. 62 వేల మందికి పింఛన్లు అందుతున్నాయని, అందులో 24 వేల మంది బీడీ పింఛను లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ఇవన్నీ గత పాలకుల హయాంలో ఎందుకు జరుగ లేదని వేముల ప్రశ్నించారు. చేతి గుర్తు, పువ్వు గుర్తు వాళ్లు మాట్లాడే అబద్ధ్దాలను ఎవరూ నమ్మరన్నారు. బాల్కొండ నియోజక వర్గంలో అభివృద్ధి ప్రజల కండ్ల ముందే ఉందని, ఈ అభివృద్ధి పనులను ప్రజల వద్దకు వెళ్లి వివరించాలని కార్యకర్తలకు సూచించారు
కేసీఆర్ అగ్గిలో దూకమన్నా దూకుతా..
కేసీఆర్ ఏది చెప్పినా తు.చ. తప్పకుండా పాటిస్తా, అగ్గిలో దూకమన్నా దూకుతానని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. పార్టీలో నాయకుడి పట్ల సంపూర్ణ విశ్వాసంతో, ఆయన మాటకు కట్టుబడి ఉండడం కార్యకర్త ధర్మమని తన తండ్రి వేముల సురేందర్రెడ్డి చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేసీఆర్తో సాన్నిహిత్యం, ఆయనకు సేవ చేసే అదృష్టం తనకు లభించడం బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో మేలు చేసిందని చెప్పారు.
బాండ్ పేపర్కు విలువ లేకుండా చేసిన అర్వింద్
ఎంపీ అర్వింద్ ఏకంగా బాండ్ పేపర్కే విలువ లేకుండా చేశాడని మంత్రి వేముల ఎద్దేవా చేశారు. పసుపుబోర్డు, మద్దతు ధర తెస్తానని రైతులను మోసం చేసి గెలిచిన అర్వింద్ వల్ల అన్నదాతలకు ఏ ఉపయోగమూ జరుగలేదన్నారు. రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి తెచ్చిన పీఎం కిసాన్ యోజన ప్రారంభమైనప్పుడు జిల్లాలో ఎంత మందికి వచ్చింది.. ఇప్పుడు ఎంత మందికి వస్తున్నదో అర్వింద్ చెప్పాలన్నారు.