రైతు సంక్షేమమే ప్రధానంగా పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇంటిపెద్దను కోల్పోయి ఆపదలో చిక్కుకున్న అన్నదాతల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నది. ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం ఆగం కావొద్దని, వారిని ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టారు. ఆగస్టు 14, 2018న పురుడు పోసుకున్న ఈ పథకం.. కష్టాల్లో చిక్కుకున్న వేలాది రైతు కుటుంబాల్లో వెలుగులు నింపింది.
నిజామాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :యావత్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడిని అందించి అందరి దృష్టిని ఆకర్షించిన సీఎం కేసీఆర్… రైతుల మేలు కోసం ఐదేండ్ల క్రితం ప్రారంభించిన రైతుబీమాను నిరాటంకంగా అమలు చేస్తున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) రైతుబీమా పథకంలో ప్రీమియాన్ని భారీగా పెంచినప్పటికీ సీఎం కేసీఆర్ భారం అనుకోకుండా ముందడుగు వేస్తున్నారు. ఐదేండ్లు పూర్తిచేసుకున్న ఈ పథకాన్ని ముచ్చటగా ఆరోసారి తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నది. మరోమారు పొడిగించడంతో లక్షలాది మంది రైతన్నలకు బీమా భరోసా దక్కింది. రైతులెవ్వరూ ప్రీమియం డబ్బులు చెల్లించకుండానే రైతుబీమా సౌకర్యాన్ని పొందుతుండడంతో వారంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. పట్టాపాసు పుస్తకం కలిగిన రైతన్న ఏ కారణం చేతనైనా మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థికసా యం అందుతున్నది. దీంతో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన వారికి బీమా సొమ్ము ద్వారా కొండం త భరోసా దక్కుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 10,687 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఒక్కో కుటుంబానికి రూ.5ల క్షలు చొప్పున రూ.534కోట్లు చెల్లించారు.
పెద్ద దిక్కుగా రాష్ట్ర సర్కారు..
రైతు కుటుంబాలకు పెద్ద దిక్కుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తున్నది. ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తూ కష్టకాలంలో కుటుంబాలకు సాంత్వన చేకూరుస్తున్నది. రైతుబీమా కోసం దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. పెద్ద కమతాలు ఉన్న వారంతా తమ కుటుంబీకుల పేరిట చిన్న కమతాలతో హక్కు పత్రాలను మార్చుకుంటున్నారు. తద్వార రైతుబీమా అమలవుతుండడంతో అర్హుల సంఖ్య భారీగానే పెరుగుతున్నది. ఐదేండ్లలో రైతుబీమాకు అర్హులైన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో 2018-19లో 1.33లక్షల మంది ఉండగా 2023-24లో లక్షా62వేల 992 మందికి చేరారు. కామారెడ్డి జిల్లాలో 2018-19లో రైతుబీమా అర్హుల సంఖ్య 1.31లక్షలు ఉండగా 2023-24లో లక్షా 99వేల 44కు చేరినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రైతుబీమా కలిగిన వ్యక్తి మరణించిన అనంతరం బీమా ప్రయోజనం ఎవరు అందుకోవాలో నిర్ణయించుకునే వెసులుబాటును లబ్ధిదారులకే సర్కారు స్వేచ్ఛను కల్పించింది. రైతులు స్వయంగా ధృవీకరించి ఇచ్చే నామినీ పేరు మీదటే చెల్లింపులుంటాయి. ఎంత పొలం ఉన్నదనే వివరాలతో నిమిత్తం లేకుండా పట్టాదారు పాసు పుస్తకం కలిగిన ప్రతి ఒక్కరూ బీమా పొందడానికి అర్హులుగా కొనసాగుతున్నారు.
ప్రీమియం పెరిగినా…
కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబీమా పథకం రైతు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నది. రైతు కుటుంబాల్లో ఏదైనా కారణంతో పెద్దదిక్కు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు, వారికి అండగా నిలిచేందుకు రైతుబీమాను అమలు చేస్తున్నది. 2018, ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా సభ్యులుగా నమోదైన రైతు చనిపోతే కుటుంబానికి రూ.5లక్ష పరిహారం వచ్చేలా సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారు. అర్హులైన రైతు చనిపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు విచారించి 15రోజుల్లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. పట్టాదారు పాసు పుస్తకం కలిగిన ఒక్కో కర్షకుడి పేరిట ఏడాదికి ప్రభుత్వమే దాదాపుగా నాలుగు వేల రూపాయలు చెల్లిస్తున్నది. తొలుత 2018-2019లో రూ.2,270 ప్రీమియం చెల్లించింది. ఎల్ఐసీ ప్రీమియం ధరను పెంచడంతో భారం అనుకోకుండానే రైతుబీమాను కేసీఆర్ సర్కారు పట్టుదలతో అమలు చేసి అన్నదాత కుటుంబాల్లో ఆత్మైస్థెర్యా న్ని నింపుతున్నది. రైతులకు నయాపైసా భారం లేకుండా రూ.వేల కోట్లను ఎల్ఐసీకి సర్కారే నిధులు చెల్లిస్తున్నది.
10వేల కుటుంబాలకు మేలు..
గతంలో పట్టాదారు చనిపోతే వారి కుటుంబానికి పైసా పరిహారం అందేది కాదు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన వినూత్న పథకంతో ఆ కుటుంబానికి నేడు ఎంతో మేలు చేకూరుతున్నది. రైతుబీమాకు పట్టాదారు పాస్బుక్కు కలిగి ఉన్న ప్రతి వ్యక్తిని అర్హుడిగా తేల్చారు. బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ(ఐఆర్డీఏ) నిబంధనల మేరకు బీమా సౌకర్యం పొందడానికి 18- 59ఏండ్లలోపు ఉన్న వారే అర్హులు. నిర్ధిష్ట వయస్సు కలిగిన వారికి గుంట భూమి ఉన్నప్పటికీ ఈ పథకం వర్తించేలా డిజైన్ చేశారు. అకాల మరణం చెందుతున్న రైతు కుటుంబాల కన్నీళ్లు తుడవడమే రైతుబీమా పథకం ప్రధాన ఉద్దేశం. నిజామాబాద్ జిల్లాలో ఐదేండ్ల కాలంలో 4,792 మంది రైతులు ఆయా కారణాలతో మరణించగా వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.239.70కోట్లు చెల్లించారు. కామారెడ్డి జిల్లాలో 5,895 మంది రైతులు చనిపోతే రూ.5లక్షలు చొప్పున మొత్తం రూ.294.75కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,687 మంది రైతు కుటుంబాలకు రూ.534కోట్లు అందించారు.
పేదల పెద్దకొడుకు సీఎం కేసీఆర్
ధర్పల్లి, ఆగస్టు 17: సీఎం కేసీఆర్ పేదలకు పెద్దకొడుకులాంటి వ్యక్తి. నా భర్త చనిపోతే ఇద్దరు ఆడపిల్లలతో ఎంతో బాధపడ్డా. ఆపదలో దేవుడే ఆదుకున్నట్లు సీఎం కేసీఆర్ నా భర్త పేరు మీద రైతుబీమా కింద అందించిన రూ.5లక్షలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ డబ్బులతో మా బాధలన్నీ తీరాయి. మాలాంటి పేదోళ్లను అన్ని రకాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి సీఎంనే మరోసారి గెలిపించుకుంటాం.
– మగ్గిడి లక్ష్మి, కేశారం
పకడ్బందీగా అమలు…
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రైతుబీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. అర్హులైన రైతుల వివరాలను ఏటా కొత్తగా రైతుబీమా పరిధిలోకి తెస్తున్నాం. ఐఆర్డీఏ నిబంధనల మేరకు 18-59ఏండ్ల వయసుంటే సరిపోతుంది. పట్టాదారు పాసుబుక్ కలిగి ఉండాలి. రైతుబీమా అద్భుతమైన పథకం కావడంతోనే లబ్ధిదారుల సంఖ్య ఏటా పెరుగుతున్నది.
– మహ్మద్ వాజిద్ హుస్సేన్, వ్యవసాయాధికారి,నిజామాబాద్ జిల్లా
బీమా డబ్బులే ఆదుకున్నాయి..
ధర్పల్లి, ఆగస్టు 17: నా భర్త చనిపోవడంతో ఇల్లు గడవక మాకుటుంబం పరిస్థితి దారుణంగా మారింది. రైతుబీమా కింద వచ్చిన డబ్బులే మమ్మల్ని ఆదుకున్నాయి. నా భర్త చనిపోయిన 15రోజుల్లోపే బీమా డబ్బులు రావడంతో మా కుటుంబ అవసరాలను తీర్చుకున్నాం. బీమా డబ్బులు సమయానికి రాకుంటే ఇల్లు గడవడం కష్టంగా మారేది. బీమా డబ్బులు అందించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. మాలాంటి నిరుపేదలకు అన్నిరకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉండడం చాలా సంతోషం.
– పిప్పెర యమున, దుబ్బాక
వారం రోజుల్లోనే బీమా డబ్బులు వచ్చాయి..
ధర్పల్లి, ఆగస్టు 17: నా భర్త భగవాన్లు చనిపోయిన వారం, పది రోజుల్లోనే బీమా డబ్బులు నా ఖాతాలో వేశారు. నా భర్త చనిపోవడంతో చిన్న పిల్లలతో ఇల్లును నడపడం చాలా కష్టమనిపించింది. భర్త చనిపోయిన కొన్ని రోజులకే బాకీలోళ్లు బాధపెట్టుడు చాలు చేసిండ్రు. అలాంటి సమయంలో మాకు అందిన బీమా డబ్బులతో బాకీలన్నీ కట్టేశాం. ఆ డబ్బులు రాకుంటే మా పరిస్థితి ఘోరంగా ఉంటుండే. ఇప్పుడు మా పిల్లలతో ఉన్నకాడికి వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా ఉంటున్నాం. మాకు బీమా డబ్బులు అందించిన సీఎం సార్కు రుణపడి ఉంటాం.
– బదావత్ బిక్కీ, మద్దుల్ తండా
రైతుబాంధవుడు సీఎం కేసీఆర్
ధర్పల్లి, ఆగస్టు 17: ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాడు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులకు భరోసా నిస్తున్నారు. మా నాన్న చనిపోవడంతో ఎంతో బాధపడ్డాం. ఆ సమయంలో వ్యవసాయాధికారులు బీమా డబ్బులను మా అకౌంట్లో వేయించారు. ఆ డబ్బులతోనే నేను పెండ్లి చేసుకున్నాను. ఇంటి పెద్దగా రైతులకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మెగావత్ గంగాధర్, మద్దుల్ తండా
అప్పుల ఊబి నుంచి బయటపడేసింది..
డిచ్పల్లికి చెందిన రెంజర్ల చిన్న గంగారాం ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లాడు. తెలంగాణ వచ్చాక తిరిగొచ్చి రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. భార్య, ముగ్గురు పిల్లలతో సాఫీగా సాగుతున్న సంసారంలో అనుకోని ఆపద వచ్చి పడింది. అనారోగ్యంతో ఆగస్టు 19, 2021లో గంగారాం కన్నుమూశాడు. ఇంటి పెద్దను కోల్పోయి, అప్పులు భారమై ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆ సమయంలో ‘రైతుబీమా’ ఆశాదీపమై ఆ కుటుంబాన్ని ఆదుకున్నది. చనిపోయిన వారం, పది రోజులకే ‘రైతుబీమా’ డబ్బులు గంగారాం భార్య జ్యోతి ఖాతాలో జమ అయ్యాయి. దీంతో అప్పులు తీర్చి.. మిగిలిన డబ్బులతో తనకున్న జనరల్ అండ్ క్లాత్స్టోర్ను విస్తరించుకున్నది. పెద్ద కూతురు గౌతమికి వివాహం చేసింది. కొడుకు సాయి, రెండో కూతురు గంగోత్రిని చదివిస్తున్నది. తమ కుటుంబానికి ‘రైతుబీమా’ ఆయువుపట్టుగా నిలిచిందని, లేకుంటే తమ పరిస్థితి ఎలా ఉండేదోనని జ్యోతి చెప్పారు. తమ కన్నీళ్లను తుడిచిన కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు.