Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో (TU) ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నిర్మలాదేవి బుధవారం టీయూ రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టగా అదేరోజు ఆమె డిప్యుటేషన్ను ఓయూ రద్దు చేసిన విషయం విదితమే. అయినప్పటికీ, నిర్మలాదేవి గురువారం రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తించారు. టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది వేతనాలకు సంబంధించిన చెక్కులపై సంతకాలు చేసినట్లు సమాచారం. మరోవైపు, నేడు హైదరాబాద్లో పాలకమండలి సమావేశం జరగనున్నది. ఇటీవలి నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీపైనే అందరి దృష్టి నెలకొంది. వీసీ రవీందర్, కొత్త రిజిస్ట్రార్ ఈ సమావేశానికి హాజరవుతారా.. కారా? అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతున్నది.
-డిచ్పల్లి, మే 4
డిచ్పల్లి, మే 4: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ నియామక వ్యవహారం, విధుల నిర్వహణపై ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీయూ రిజిస్ట్రార్గా ఓయూ ప్రొఫెసర్ నిర్మలా దేవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. అదేరోజు నిర్మలా దేవి రిలీవ్ ఉత్తర్వులను ఓయూ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే రిజిస్ట్రార్ మాత్రం ఆ ఉత్తర్వులను పక్కనబెట్టి యథావిధిగా గురువారం పరిపాలనా వ్యవహారాల్లో పాల్గొన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలకు సంబంధించిన రెండు చెక్కులపై సంతకాలు సైతం చేశారు. రిలీవ్ ఉత్తర్వులను ఓయూ రద్దు చేసిన దరిమిల రిజిస్ట్రార్ విశ్వవిద్యాలయానికి రాదని అందరూ భావించారు. గురువారం ఆమె విశ్వవిద్యాలయానికి చేరుకొని విధులు నిర్వర్తించడంతో అంతా అవాక్కయ్యారు. ప్రతినెలా టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందితోపాటు అవుట్సోర్సింగ్ సిబ్బందికి 1 లేదా 2వ తేదీల్లో వేతనాలు వారి ఖాతాల్లో వేసేవారు. ఇప్పటికీ రెండు రోజులు గడుస్తున్నప్పటికీ వేతనాలు వేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. వీసీతో సమావేశమైన తర్వాత రిజిస్ట్రార్ నిర్మలాదేవి టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది వేతనాలకు సంబంధించిన ఫైల్ను రెడీ చేయాలని ఆదేశించారు. దీంతో అకౌంట్ సెక్షన్ చెక్కులను సిద్ధం చేయగా వాటిపై సంతకం చేసి బ్యాంక్కు పంపించారు.
నేడు పాలకమండలి సమావేశం
తెలంగాణ విశ్వవిద్యాలయ పాలకమండలి సమావేశం హైదరాబాద్లోని నాంపల్లి రూసా భవనంలో శుక్రవారం ఉదయం 11గంటలకు నిర్వహించనున్నారు. గత నెల 19 నుంచి చోటు చేసుకున్న గందరగోళ పరిస్థితుల నేపథ్యం లో నేడు పాలకమండలి సమావేశం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు మొదట ఉత్పన్నమయ్యాయి. వాస్తవానికి ఏప్రిల్ 19న టీయూ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ, రెండేండ్లపాటు రిజిస్ట్రార్గా ఆయనే కొనసాగుతారని కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మా నం చేశారు. దీంతో పాలకమండలి సమావేశం నుంచి వెళ్లిపోయిన వైస్చాన్స్లర్.. పాలకమండలి నిర్ణయాలన్నింటినీ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు నిలుపుదల చేయడంతో రిజిస్ట్రార్గా బాధ్యతలు తీసుకున్న యాదగిరి సైతం చాంబర్కు రావడం మానేశారు.
సమావేశాలు నిర్వహించేందుకు రిజిస్ట్రార్ నుంచే పాలకమండలి సభ్యులకు ఎజెండా పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాదగిరి రిజిస్ట్రార్గా లేకపోవడం కొత్త రిజిస్ట్రార్ బాధ్యతలు స్వీకరించడంతో అంతా అయోమయం నెలకొన్నది. మరోవైపు ఈసీ మెంబర్లకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్న వైస్చాన్స్లర్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకమండలి సమావేశాలకు హాజరుకాకుండా సభ్యులపైనే లేని పోని ఆరోపణలు చేయడంతో సభ్యులంతా వీసీపై ఆగ్రహంతో ఉన్నారు. శుక్రవారం నిర్వహించే పాలకమండలి సమావేశానికి వీసీ రవీందర్, కొత్త రిజిస్ట్రార్లు హాజరవుతారా? లేదా? అనే విషయంలో సందిగ్ధం నెలకొన్నది. సమావేశం సజావుగా జరిగి, రిజిస్ట్రార్ నియామక వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందో? లేదో వేచి చూడాలి.