గాంధారి, జనవరి 10: అడవిలో నుంచి పొలాల్లో మేయడానికి వచ్చిన ఓ మనుబోతును వేటగాళ్లు హతమార్చారు. ఈ ఘటన మండలంలోని చెన్నాపూర్ ఫారెస్ట్ బీట్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్నది. గాంధారి రేంజ్ అధికారి రవిమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నాపూర్ ఫారెస్ట్ బీట్ పరిధిలోని బిచ్యానాయక్ తండా శివారులో ఉన్న పొలాల్లోకి మంగళవారం ఓ మనుబోతు వచ్చింది. గమనించిన కొందరు తండావాసులు దానిని వెంటాడి హతమార్చారు.
విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు నిందితులను పట్టుకోవడానికి తండాకు వెళ్లారు. గమనించిన నిందితులు మనుబోతు కళేబరాన్ని వదిలిపెట్టి పారిపోయారు. అప్పటికే మనుబోతు తలను వేరుచేశారు.
తండాకు చెందిన బర్దావల్ ఇందల్ సింగ్, కెతావత్ పూమ, మంజా నానక్సింగ్, మంజా జైల్సింగ్, బస్సీ రమేశ్ అనే ఐదుగురు మనుబోతును వేటాడినట్లు గుర్తించామని రేంజ్ అధికారి తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి, గాలిస్తున్నామని అన్నారు. మనుబోతు కళేబరానికి పంచనామా నిర్వహించి, అటవీ ప్రాంతంలో దహనం చేశామని తెలిపారు. ఆయన వెంట ఎఫ్ఆర్వో అరుణ, బీట్ ఆఫీసర్ రవి తదితరులు ఉన్నారు.