ఖలీల్వాడి, జూన్ 2 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో నిజామాబాద్ నగరం పచ్చదనంతో కళకళలాడింది. డివైడర్లపై నాటిన మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నగర మేయర్ను ఢిల్లీకి పిలిపించుకొని అవార్డు కూడా ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నగరాభివృద్ధిపై నిర్లక్ష్యం నెలకొన్నది. మొక్కలను పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో అవి ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, జీవన్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ మేయర్ నీతూ కిరణ్ నగరంలో పర్యటిస్తుండగా ఎండిపోయిన మొక్కలు వారికి కనిపించాయి.
దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిందెలతో నీళ్లు తెచ్చి మొక్కలకు పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20 కిలోమీటర్ల పైచిలుకు డివైడర్లలో మొక్కలు నాటామని తెలిపారు. దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటి వ్యవస్థ కూడా కల్పించామని, అందుకే బెస్ట్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చినట్లు చెప్పారు.
కానీ నేడు దాదాపు అన్ని ప్రాంతాల్లో మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. వేసవి కాలం కన్నా ముందే తాను హెచ్చరించినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే ధన్పాల్ పెడచెవిన పెట్టి కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. కనీసం ఇప్పటికైనా ఎమ్మెల్యే పట్టించుకొని చెట్లను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సిర్ప రాజు, ప్రభాకర్రెడ్డి, సత్యప్రకాశ్, సుజిత్సింగ్ ఠాగూర్, నవీద్ ఇక్బాల్, మతీన్, జగత్రెడ్డి పాల్గొన్నారు.