నవీపేట,డిసెంబర్ 30 : నవీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) గత కొన్నేండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. మండల కేంద్రంలో బాసర ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన రైల్వేగేటును ప్రతి అరగంటకు ఒక మారు వేయడంతో బాసర జ్ఞాన సర్వసతీ ఆలయానికి వెళ్లే భక్తులతో పాటు మహారాష్ట్ర తదితర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాదారులు, స్థానిక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నవీపేట మ్యాన్ లెవల్ (188 నంబర్) గల మార్గం గుండా ప్రతి నిత్యం 45 రైళ్లు వివిధ రాష్ర్టాలకు రాక పోకలు సాగిస్తున్నాయి. ప్రతి అరగంటకు ఒకమారు గేటు పడడంతో ఈ రోడ్డు గుండా ప్రయాణం కొనసాగిస్తున్న వాహనదారులు, విద్యార్థులు, అంబులెన్స్లో ఆరోగ్య సమస్యలతో దవాఖానలకు వెళ్లే రోగులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.
రైల్వేగేట్ పడిందంటే 10 నుంచి 15 నిమిషాల పాటు నిరీక్షించాల్సిందే అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంటున్నది. ఒక్కో దశలో రైళ్ల క్రాసింగ్తో పాటు రెండు గూడ్స్ రైళ్లు వస్తే 20 నిమిషాల పాటు గేటు తెరుచుకోక పోవడంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ పొడవున ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రజలు పడుతున్న అవస్థలు అంతాఇంతా కాదు. రైలు వెళ్లిన అనంతరం గేటు తెరుచుకోగానే వాహనదారులు తొందరగా వెళ్లాలనే ఆతృతతో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలూ లేక పోలేదు. కాగా ఈ రోడ్డు మార్గం ద్వారా మాములు రోజుల్లో నిమిషానికి 16, గంటకు 960 వాహనాలు ప్రయాణం సాగిస్తుండగా ఈ లెక్కన ఒక్కరోజుకు సుమారు 24 వేల వివిధ రకాల వాహనాలు ఈ మార్గం గుండా వెళ్తున్నాయి. శని, శుక్ర, ఆది, సోమవారాల్లో ఈ రద్దీ మరింత ఎక్కువ ఉంటుంది.
పట్టించుకోని ఎంపీ అర్వింద్
45 నెలల నుంచి ఎంపీగా కొనసాగుతూ జిల్లా అభివృద్ధిపై కారు కూతలు కూస్తున్న అర్వింద్ నవీపేటలో ఆర్వోబీ మంజూరు చేయించడంలో విఫలమయ్యారని ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. నవీపేటలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆవశ్యకతను గుర్తించిన ఆర్అండ్బీ అధికారులు మూడేండ్ల క్రితమే నవీపేట ఆర్వోబీ మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు ఆర్వోబీ మంజూరు కాక పోవడంతో బాసరకు వెళ్లే భక్తులతో పాటు మండల ప్రజలు, విద్యార్థులు, దూర ప్రాంతాలకు ఈ మార్గం గుండా వెళ్లే ప్రతి ఒక్కరికీ శాపంగా మారిందని చెప్పవచ్చు. ఎంపీ అర్వింద్ నవీపేట ఆర్వోబీ మంజూరు చేసి తన పనితనాన్ని నిరూపించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
రూ.92 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం
నవీపేటలో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) కోసం కేంద్ర ప్రభుత్వానికి రూ.92 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. జాన్కంపేట్ నుంచి ఫకీరాబాద్ వరకు ఫోర్లేన్ బాసర రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ రోడ్డు మార్గం గుండా బాసర దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్వో బీ మంజూరుకు అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తాం.
–రాజేశ్వర్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ, నిజామాబాద్
భక్తులు, రోగులకు తప్పని ఇబ్బందులు
మండల కేంద్రంలో రైల్వేగేటు పడిన ప్రతి సారీ బాసరకు వెళ్లే భక్తులతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, అంబులెన్స్లో తరలించే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంత సమయంలో గేటు పడిన ప్రతిసారి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతున్నది. తద్వారా రోడ్డుకు ఇరువైపులా ఎక్కడిక్కడ వాహనాలు నిలిచి పోవడంతో స్థానికులు సైతం ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు. తక్షణమే ఆర్వోబీ నిర్మించాలి.
-ఏటీఎస్ శ్రీనివాస్, సర్పంచ్, నవీపేట