ఇందూరు/విద్యానగర్, సెప్టెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై నిజామాబాద్ కలెక్టరేట్లో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజుతో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు. కామారెడ్డిలో ఎంపీ బీబీపాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్ పర్సన్ దఫేదార్ శోభ, కలెక్టర్ జితేశ్ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. లోటుపాట్లకు తావులేకుండా పండుగ వాతావరణంలో వజ్రోత్సవాలను నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం మేరకు ఉత్సవాల కోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సమావేశం అనంతరం మంత్రి ప్రశాంత్రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించగా, తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న రాచరికం నుంచి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇది జరిగి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఏడాది పొడుగునా ఈ ఉత్సవాలు కొనసాగనుండగా, ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యువత, మహిళలు, విద్యార్థులు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని జాతీయ స్ఫూర్తిని చాటాలని మంత్రి పిలుపునిచ్చారు.
16న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 15 వేల మందితో జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించిన అనంతరం బహిరంగ సభలో వజ్రోత్సవాల ప్రాధాన్యత, తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతపై వక్తలు వివరిస్తారన్నారు. 17న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయనున్నట్లు వివరించారు. పంద్రాగస్టు వేడుకల తరహాలోనే కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో తాను కలెక్టరేట్లో జరిగే జెండాష్కరణ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. అదేరోజున హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి సుమారు 3,500 మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజాప్రతినిధులు, విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో తరలించేలా ఏర్పాట్లు చేశామని, వారికి అల్పాహారం, భోజన వసతి కూడా కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక ప్రదర్శనలు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర విశిష్టత, స్ఫూర్తిని చాటిచెప్పాలని మంత్రి ప్రశాంత్రెడ్డి కోరారు. నిజామాబాద్ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నగర పాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ చిత్రామిశ్రా, కామారెడ్డిలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రె తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలపై స్పీకర్ పోచారం సమీక్ష
అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపు
బీర్కూర్, సెప్టెంబర్ 14 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వజ్రోత్సవాల ఏర్పాట్లపై బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి 584 సంస్థానాలు ఉండేవన్నారు. నిజాం పాలనలో ఉన్న తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాంతాలకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల తరహాలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కూడా మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 16న నియోజకవర్గంలోని 15వేల మందిని సమీకరించి బాన్సువాడ పట్టణంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
ఇందులో భారీ జాతీయ జెండాతో నాలుగు కిలోమీటర్ల మేర ప్రదర్శన ఉంటుందన్నారు. ర్యాలీగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుంటామని, అనంతరం 15వేల మందికి భోజన వసతిని కూడా కల్పిస్తామన్నారు. వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని స్పీకర్ కోరారు. సమావేశంలో బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, ఎంపీపీలు రఘు, విఠల్, జడ్పీటీసీలు భాస్కర్రెడ్డి, స్వరూప, సొసైటీ చైర్మన్ శ్రీధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.